Please assign a menu to the primary menu location under menu

Tag Archives: VIZAG JC

GovernmentPolitical

పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు..

స్టాండిరగ్‌ కమిటీ తీర్మానం లేకుండా జీవీఎంసీ ఆస్తుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే కీలక మార్కెట్‌లు ప్రస్తుతం దొంగల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇంటి దొంగల సంరక్షణలో ఉండాల్సిన ఆస్తులను సైతం కమీషన్‌లకు కకుర్తిపడి బయట దొంగలకు అప్పగించినట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తరహా తంతుని చూసి ప్రశ్నించాల్సిన స్థానిక స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడు సైతం ఆ ముఠాలతో చేతులు కలిపినట్టే కనిపిస్తుంది. ఏడాదికి రూ.కోటికి పైగా అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌, సుమారు రూ.30లక్షలకు పైగా అందించే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ ఈ ఏడాది అంతర్గత లెక్కలు లెక్కించిన అధికారుల లెక్కల ప్రకారం పూర్ణామార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.97.28లక్షలకు, అదే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.23.10లక్షలకు బహిరంగ వేలం పాట ద్వారా ఖరారు చేశారు. ఈనెల మొదటి నుంచి పాట పాడిన వ్యక్తులకు అప్పగించడానికి కుతూహలంతో ఉన్న జోనల్‌ స్థాయి అధికారులు స్టాండిరగ్‌ కమిటీ తీర్మాణం లేకుండానే ఇవ్వడం వెనుక మర్మం ఏంటో అని మార్కెట్‌లో వ్యాపారులే ఆసక్తి చూపుతున్నారు. బయట సమాజాన్ని నమ్మించడానికి 15మంది సచివాలయ కార్యదర్శిలు, ముగ్గురు మజ్దూర్‌లను, ఒక ట్యాక్స్‌ కలెక్టర్‌, ఒక పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ ఉద్యోగిని నియమించినట్టు గతనెల 29న సంతకాలు చేసి ఆదేశాలను జారీ చేశారు. కానీ వాస్తవానికి ఈ ఉద్యోగులు ఈనెల 1నుంచి నేటి వరకు అదే జోనల్‌ కార్యాలయ సీసీ కెమెరాల పరిధిలోనే పనిచేసినట్టు రికార్డింగ్‌లు సంబంధిత విభాగంలోనే భద్రపరిచి ఉండటం కొసమెరుపు. నకిలీ అదేశాలను జారీ చేసిన అధికారులు అటుగా సిబ్బందిని కేటాయించిన స్థానంలో పని చేస్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో సైతం ఉంటే బాగుండేదని పలువురు వ్యాపారులు హేళన చేస్తున్నారు.

File source: https://commons.wikimedia.org/wiki/File:Purna_Market_in_Visakhapatnam.jpg
  • స్టాండిరగ్‌ కమిటీ అదేశాలు ఎక్కడ..?

జీవీఎంసీలో జరిగిన ఆర్థిక లావాదేవీలను స్టాండిరగ్‌ కమిటీ తీర్మాణంతో కేటాయించాల్సి ఉన్నా.. జోన్‌-4 రెవెన్యూ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏడాదికి రూ.కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పూర్ణామార్కెట్‌, రూ.30లక్షలకు పైగా ఆదాయాన్ని ఇచ్చే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని ఎటువంటి అనుమతులు లేకుండా జీవీఎంసీ కమిషనర్‌ పేరిట టోకెన్లను ముద్రించి బయట వ్యక్తులకు అప్పగించారు. నామ మాత్రంగా బృందాలను కేటాయించి పూర్తిస్థాయిలో బయట వ్యక్తులతో ఆశీలు వసూళ్లు చేయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమ సిబ్బంది మాత్రమే వసూలు చేస్తున్నారని వివరిస్తున్న అధికారులు ఇప్పటి వరకు జీవీఎంసీ సౌకర్యంలో ఎంత మొత్తంలో జమ చేశారో లెక్కలు చూపించాలని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. స్టాండిరగ్‌ కమిటీ అనుమతి కూడా లేకుండా బయట వ్యక్తులతో రెండు మార్కెట్‌ల్లో వసూలు చెయిస్తున్నారంటే సంబంధిత అధికారులు ఎంత మొత్తంలో నకిలీ బృందాల నుంచి వసూలు చేశారో లెక్కలు చూడాల్సి ఉంది.

  • గెజిట్‌ లెక్కలు గోడలకు మాత్రమే పరిమితం..

ఆశీల పాటను నిర్వహించిన అధికారులు గెజిట్‌ లెక్కల ఆధారంగా వసూలు చేయాలని గుత్తేదారులకు ముందుగానే అవగాహన పరుస్తారు. వాటికి అనుగుణంగానే అధికారులు వాళ్లకు పాటను కేటాయించి అటుగా వసూళ్లు చేయాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు అక్రమ మార్గంలో ఆశీల వసూళ్లకు అవకాశం కల్పించి ఇష్టానుసారంగా దండుకుంటున్నా అటుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో ద్విచక్ర వాహనానికి రూ.10, కార్లుకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ వాహనాలకు రూ.300, సరుకులు రవాణాకు ఉపయోగించే వాహనాలకు రూ.200 దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. రామకృష్ణ కూరగాయల మార్కెట్‌లో రూ.20కి బదులుగా దుకాణానికి రూ.50, రహదారిపై తాత్కాలికంగా వ్యాపారం చేసి వెళ్లిపోయే రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150వరకు వసూలు చేస్తున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. గెజిట్‌లో లెక్కలను పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ప్రధాన మార్గంలో గోడలకు మాత్రమే పరిమితం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రహదారిపై వ్యాపారాలకు విశ్వ ప్రయత్నాలు..

నిత్యం రద్దీగా ఉండే పూర్ణామార్కెట్‌ ప్రధాన రహదారిపై తొలిగించిన వ్యాపారాలు యధావిధిగా పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్థానిక నాయకున్ని మంగళవారం తీసుకొచ్చి ఆశీలు వసూళ్లు చేయడానికి అర్హత లేని గుత్తేదారులు రహదారిపై దండలతో సన్మానాలు చేసి ఆయన్ని మచ్చిక చేసుకుంటున్నారు. మనిషికి రెండు జంగిడీల చొప్పున కేటాయించి వ్యాపారాలు జరపడానికి చూస్తున్నారు. ఈ జంగిడీలు రహదారిపై పెట్టి వ్యాపారం చేస్తే గుత్తేదారులకు అక్షరాల రూ.40లక్షల వరకు లాభం వస్తుందని మాజీ గుత్తేదారులు సైతం వెల్లడిస్తున్నారు. వ్యాపారులపై ఉన్న ప్రేమ కంటే రూ.40లక్షలపై ఎక్కువ ప్రేమ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై నగర పోలీసు కమిషనర్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

DevotionalGovernmentPolitical

అప్పన్న ఆలయంలో అయోమయం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : వరాహ నృశింహునిగా.. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా.. ద్వయ రూపాలతో వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలంలో అయోమయం సంతరించుకుంది. ఆలయ అధికారుల పర్యావేక్షణ లోపం, పనిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంతో అప్పన్న దర్శనానికి తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆలయ అధికారులు అటుగా ఆలోచనలు చేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో భక్తజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.లక్షల్లో జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు శీతల గదులకు పరిమితమైపోవడంతో తాత్కలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సిబ్బందికి ఇష్టారాజ్యమైపోయింది. రాజమార్గంగా ఉపయోగించే గాలిగోపురం వద్ద అన్ని బాధ్యతలను సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో వదిలిపెట్టడం, పీఆర్‌వో కార్యాలయంలో ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపయోగించడం, ఆ సిబ్బందితో పాటుగా సంబంధిత ప్రైవేటు సంస్థకు మంచి ఆదాయాన్ని అందుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామి దర్శనానికి సెక్యూరిటీ సంస్థ ప్రతినిథులు, వాళ్ళ బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది బంధువులు వస్తే వీవీఐపీ దర్శన భాగ్యాన్ని కలిగించడంలో మంచి నైపుణ్యం సంపాధించారు. ఈ అంశాలు కొందరు ఆలయ అధికారులకు తెలిసినా వాళ్ళ బంధువులకు అదే పద్ధతిలో దర్శనాలు చేయించడానికి ఉపయోగపడతారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఏది ఏమైన అధిక సంఖ్యలో సిబ్బంది కలిగిన సింహాచలంలో ప్రైవేటు సిబ్బంది పెత్తనం ముందు ముందు చాలా ప్రమాదకరం.

  • పీఆర్‌వో కార్యాలయాన్ని ముడుపులు కోసం పట్టి పీడిస్తున్నారు..

ఆలయ పీఆర్‌వో కార్యాలయంలో సిబ్బంది చక్కగా స్థిర పడ్డారనడంలో ఆశ్చర్య పడనవసరం లేదు. మూడు నుంచి ఐదు నెలలకు ఒకసారి అన్ని విభాగాల్లో సిబ్బందిని మార్పులు చేర్పులు చేసే అధికారులును సైతం తమ చేతుల్లో పెట్టుకొని పీఆర్‌వో కార్యాలయంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ప్రైవేటు సంస్థ నుంచి సెక్యూరిటీలుగా తీసుకున్న సిబ్బందిని పీఆర్‌వో కార్యాలయంలో సహాయకులుగా ఉపయోగించడంలో పెద్ద కుట్ర జరుగుతుందని, దర్శనాలు చేయించే సమయంలో భారీగా ముడుపులు అందుకుంటున్నట్టు పలు ఆధారాలు సైతం బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు రెండోసారి పీఆర్‌వో కార్యాలయానికి వెళ్లకుండానే వ్యక్తిగత నెంబర్లను ఇచ్చి క్యాష్‌ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ స్థిర పడిపోయిన సిబ్బంది మార్పుతోనే సాధ్యపడుతుందని పలువురు భక్తులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • కేశఖండనశాలలో రద్దీ తీవ్రమవుతుంది..

అప్పన్న స్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందులు అక్కడ సిబ్బంది కొరత కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో తాత్కాలిక నాయిబ్రాహ్మణ సిబ్బందిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 69మంది సిబ్బందితో కొనసాగుతున్న కేశఖండనశాలలో 5గురు మాత్రమే పూర్తిస్థాయి ఆలయ ఉద్యోగులు కావడం, మనిషికి 60టికెట్లు చొప్పున ఐదుగురికి రోజుకి 300 టికెట్లకు గాను రూ.12వేలుని ఆలయానికి ఇచ్చి మిగిలిన మొత్తం అక్కడి నాయిబ్రాహ్మణులు సమాన వాటాలతో సొమ్ము పంచుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శని, ఆదివారం వంటి వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో భక్తులు అధికంగా వచ్చే సమయంలో రద్దీ తీవ్రంగా ఉండగా అధిక మొత్తం సంపాధించాలనే ఉద్ధేశంతో పొరుగు సిబ్బంది రాకుండా ఇక్కడ కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారని సమాచారం.

  • గాలిగోపురం వద్ద సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు..

స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్వామి హుండీల్లో చెల్లించిన ముడుపులుకంటే ఆలయ సిబ్బందికే ఎక్కువ కానుకలు చెల్లిస్తున్నారు. గాలిగోపుం గుండా స్వామిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ధర చెల్లించిన భక్తులతో పాటుగా ప్రోటోకాల్‌ భక్తులను పంపించాలని నిబంధనలు ఉన్నా.. కాసుల కక్కుర్తిలో గాలిగోపురం గుండా పైరవీలు చేసే వ్యక్తులకు, కానుకలు ఇచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించకుండా ప్రైవేటు సెక్యూరిటీలకు పెత్తనం ఇవ్వడంతో వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా తయారైయింది. దీనికి తోడు తాత్కాలిక సిబ్బంది టికెట్లు తియ్యకుండా సగం తీసుకొని దొంగ మార్గంలో భక్తులను దర్శనాలకు పంపిస్తున్నట్టు ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారి స్పందిస్తారో..? లేదో..? వేచి చూడాలి.

చందనోత్సవంలో ఏర్పాట్లు..?

స్వామివారి ఆలయంలో తీవ్ర రద్దీని తలపించే చందనోత్సవ కార్యాక్రమంలో ఆలయ అధికారుల పనితీరు రెండేళ్లు క్రితం జరిగిన ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఇంచార్జి స్థాయిలో ఎటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదని మడికట్టుకొని కూర్చున్న ఉన్నతాధికారి తీరుకి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అని పలువురు సిబ్బంది అయో మయానికి గురవుతున్నట్టు అనుమనాలు వ్యక్త పరుస్తున్నారు.

  • స్వామివారిని కనులారా చూద్దాం రండీ..

వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు ఏప్రిల్‌ 30న జరిగే చందనోత్సవంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటుగా రవాణా, భద్రత, తాగునీరు, దర్శనం, వసతి, వైద్యం, ప్రసాదం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఆ రోజున రూ.300, రూ.1000, రూ.1500 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లు ఆఫ్‌లైన్‌తో పాటుగా www.aptemples.ap.gov.in లో
విక్రయిస్తున్నారు.

Government

ప్రైవేట్ పాఠశాలల్లో పైశాచికత్వం

ఓవైపు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి.. మరోవైపు తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : చదువుల బరువు మోసి చిన్నారి మనసులు చితికి పోయే.. మార్కుల కోసం పరుగులెత్తి బాల్యం దూరమయ్యే.. అనే పదాలను పద్య రూపంలో ఓ సమకాలీన కవి నాడు చెప్పినట్టే నేడు ప్రైవేట్‌ పాఠశాలల్లో వ్యవహరిస్తున్న తీరు చిన్నారుల బాల్యాన్ని శూన్యం దిశగా సాగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పొరుగు పాఠశాలలతో పోటీ పడుతూ విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించకుండా పాఠశాల యాజమాన్యలు తీవ్ర ఒత్తిడిని కలిగించడం చాలా ప్రమాదకరమని పలువురు పరిశోధనాత్మక విద్యావేత్తలు వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ సరైన సూచనలు జారీ చేయకపోవడం, జారీ చేసిన సూచనలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య అధికంగా వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాను 11మండలాలుగా విభజించి వాటికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను కేటాయించి, ఒక్కొక్క మండలంలో కొన్ని సమూహాలు(క్లస్టర్‌లు)గా విడదీసి సీఆర్‌పీలను నియమించినా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి అన్ని అంశాల్లో మరింత చురుకుగా పాల్గొని ఆహ్లాదకరమైన విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాలలపై అసభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదులు చేస్తున్నారంటే విద్యా విధానం ఎటుగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రభుత్వం పదోవ తరగతి విద్యార్థులకు సరైన ప్రణాళికతో చదవడానికి 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌ని ప్రారంభించగా ప్రైవేటు పాఠశాలలు పాటించే తీరు విద్యార్థులను ఒత్తిడి దిశగా తీసుకెళ్తుందని పలువురు విద్యార్థులే వెల్లడిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలకే పరిమితం చేయడం, సెలవు దినాలు, ఆదివారాల్లో సైతం తరగతులు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రోధిస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించే దిశగా కొన్ని పాఠశాలలు ప్రణాళికలను రచిస్తుంటే మరికొన్ని డబ్బా పాఠశాలలు ఆర్భాటం చేయడంలోనే పనితనం చూపించి ఫలితాల్లో శూన్యం చూపిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే సెలవు దినాలు, సమయాన్ని పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవల్సిన విద్యాశాఖ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వత్తాసు పలకడంతో విద్యా వ్యవస్థ దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఫీజులు నియంత్రణ అంశాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా ఏ ఒక్కరూ అటుగా ప్రశ్నించకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి.

  • ప్రైవేట్‌ పాఠశాలలపై ఆశాఖకు అంత ప్రేమ ఎందుకో..?

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సమానంగా విద్యా విధానాన్ని రూపొందించడం, పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంశాల్లో మాత్రమే శ్రద్ధ చూపించాల్సిన విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ద్వంద వైఖరిగా వ్యవహరించడం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాల నుంచి లాభాపేక్ష అధికంగా ఉండటంతో దిగువ స్థాయిలో ఉండే సీఆర్‌పీలు, ఎంఈవోలతో కలిసి సహాయ అధికారులు, ఉన్నతాధికారులు సైతం విద్యా ప్రమాణాలు పాటించని పాఠశాలలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనార్హం. ప్రత్యేక తరగతుల పేరిట ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలలు నిర్వహించడం, పాఠశాలలోనే ప్రత్యేక బోధన పేరిట ట్యూషన్‌ తరగతులు పెట్టడం, సెలవు దినాల్లో పాఠశాలల్లో తరగతులు జరపడం వంటివి చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఫీజులు వసూల అంశపై నియంత్రణ ఉందా..?

చిన్నారులకు ఉన్నతమైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు పస్తులుండి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడంపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా విభజిస్తూ సరసమైన పద్ధతిలో ఫీజులను తీసుకోవాలని ఆదేశాలు కేటాయించినా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కూడా పట్టించుకోలేదు. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చోద్యం చూడటంపై ప్రైవేట్‌ పాఠశాలల తీరు చాలా కుటుంబాలను చిన్నాభిన్నాం చేసిందనడంలో ఆశ్చర్య పడనవసరం లేదనే చెప్పాలి. ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ప్రకారం గత మూడేళ్లుగా నర్సరీ నుంచి ఐదో తరగతికి గ్రామ పంచాయితీల్లో రూ.10వేలు, మున్సిపాల్టీల్లో రూ.11వేలు, కార్పొరేషన్‌లల్లో రూ.12వేలుగా అదే ఉన్నత విద్య 6నుంచి 10 తరగతి వరకు పంచాయితీల్లో రూ.12వేలు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ల్లో రూ.18వేలుగా కేటాయించినా అటుగా ఏ ఒక్క ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గం. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.

  • ఆర్టీఈ యాక్ట్‌2009ని ఎవరు పాటిస్తున్నారో..?

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌2009 అనేది భారతదేశంలో పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించే చట్టంగా ప్రవేశపెట్టారు. 6నుంచి 14సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు తన నివాస స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఈ పద్ధతిలో ప్రైవేట్‌ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్‌ చేయాలి. కానీ జిల్లాలో కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని నామమాత్రంగా స్వీకరించి ఉచిత సీటులను కేటాయిస్తే.. మరికొన్ని పాఠశాలలు అటువంటి అవకాశాలు లేవని ఖచ్చితంగా వెల్లడిరచాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అర్హత పొందినా విద్యార్థి వయస్సు సరిపోలేదని, ఆ చట్టం అందుబాటులో లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పుతూ తప్పించుకున్నారు. దీనిపై ఇప్పటికే గత జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. దీనిపై పాఠశాలల వారీగా పర్యవేక్షించాల్సిన దిగువస్థాయి సిబ్బంది సైతం చోద్యం చూస్తూ ఉండిపొయారు. ఒత్తిడి విద్యను అందిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలతో పాటుగా అటుగా పట్టించుకోని విద్యాశాఖ సైతం పైశాచికత్వంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

Government

హస్త కళలను ప్రోత్సహించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్

 నేత్ర న్యూస్, విశాఖపట్నం : హస్తకళలను ప్రోత్సాహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. మదురవాడలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజారు, కళాత్మక చేనేత వస్త్రముల ప్రదర్శన, అమ్మకాలను ఆయనతో పాటు ఆయన సతీమణి విశ్వాంజలి గైక్వాడ్ లు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. భారతదేశ కళలను సంరక్షించుటకు, కాపాడుటకు, అభివృద్ధి పరచుటకు సరియైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వాటి ఉన్నతికి హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకు వారిని ప్రోత్సహించాలన్నారు. హస్త కళలను ప్రోత్సహిస్తూ వారి శ్రేయస్సు కొరకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోగల వివిధ రాష్ట్రముల నుండి జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అనేక మంది చేతివృత్తి కళాకారులు తాము తయారుచేసిన వివిధ కళాఖండములను ఒకే వేదిక వద్దకు తీసుకువచ్చి పొందిన చేతితో తయారుచేయబడిన కళాఖండములను ప్రేమించి విశాఖ నగర పౌరులకు కళాకారులే తమ వస్తువులను నేరుగా అమ్ముకొను సౌకర్యమును కల్పించుటయే ఈ గాంధీ శిల్ప బజారు యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

 

ఈ ప్రదర్శనలో పాల్గొను కళాకారులు కొనుగోలు దారుల అభిరుచికి తగ్గ ప్రసిద్ధ డిజైన్లను ప్రస్తుత వ్యాపారానికి తగినట్లుగా తయారుచేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనలో సుమారు 100 నుండి 125 మందికి పైగా వివిధ రకాల చేతివృత్తుల కళాకారులు తమ వస్తువులను ప్రదర్శన, అమ్మకమునకు ఉంచబడినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి కలంకారి ప్రింటింగ్, పెయింటింగులు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లేసు అల్లికలు, చెక్కతో తయారు కాబడిన వివిధ రకాల కళాకృతులు, టెర్రకోట పాటరీలు, తాటియాకులతో తయారు కాబడిన వస్తువులు, ఏలూరు తివాచీలు, కేన్ వస్తువులు, మంగళగిరి డ్రస్ మెటీరియల్స్, చీరాల చీరలు, హైదరాబాదు ముత్యాలు, నిజామాబాద్ మెమెంటోలు, బ్లాక్ మెటల్ వస్తువులు, ఉదయగిరి ఉడెన్ కట్లరీ వస్తువులు, నిర్మల్ పెయింటింగ్లు, తదితరమైనవి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణములు, తివాచీలు, వివిధ ఆకృతుల లోహపు వస్తువులు, శిలలతో తయారుచేయబడిన కళాత్మక వస్తువులు, వివిధ రకాల ప్రింటింగ్ వస్త్రాలు, చిత్రపటాలు, సిల్వర్ ఫిలిగ్రీ, లడ్డు గాజులు, దోప్లేస్టింగ్లు, డ్రై ఫ్లవర్స్, కేన్ వస్తువులు, బాతిక్ పెయింటింగ్లు, ఉద్-ఇన్-లే వస్తువులు, తంజావూరు, మైసూరు పెయింటింగులు మొదలగునవి. ప్రదర్శన, అమ్మకమునకు ప్రరర్శించినట్లు చెప్పారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటలు నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయని, శెలవు దినములలో కూడా తెరచి ఉంటాయన్నారు. ఈ ప్రదర్శన హస్తకళల అభివృద్ధి కమిషనర్ కార్యాలయములు, జౌళిశాఖ, కేంద్రప్రభుత్వం, న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ) లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్, విశాఖపట్నం వారి సౌజన్యంతో నిర్వహించబడుచున్నదని తెలిపారు.

గాంధీ శిల్పబజూరు లేపాక్షి హస్తకళలు మరియు కళాత్మక చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకమునకు వివిధ రాష్ట్రముల నుండి వచ్చిన కళాకారులు తాము తయారుచేసిన వస్తువులను నేరుగా అమ్ముకొనుటకు విస్తృత ప్రచారం గావించి వారికి చేయూత నివ్వవలసినదిగా కోరారు. కార్యక్రమంలో ఎపి హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. విజయలక్ష్మి, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ మనోహర్, విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య, డిసి హెచ్ ఎడి అపర్ణ లక్ష్మి. యన్, హెచ్ పిఓ ఎం సువర్చల, లేపాక్షి మేనేజర్ కె. విజయ గౌరి, ఇన్ చార్జ్ మేనేజర్ బి. శైలజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.