Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: JENASENA

GovernmentPolitical

రైతు బజార్‌ స్కాంలో ఎవరికి ఎంత వాటా..?

  • రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని రైతు బజార్‌గా మార్పుచేస్తున్నట్టు బయపెట్టి దోచుకున్న వైనం..

  • కూరగాయల మార్కెట్‌కు ‘రైతు బజార్‌’ గండం..!
    రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ పేరు వింటేనే నాణ్యమైన కూరగాయలకు చిరునామా అన్నట్లుగా గుర్తొస్తుంది. లక్షలాది రూపాయల వ్యాపారం జరిగే ఈ మార్కెట్‌ను ప్రారంభంలో కేవలం కూరగాయల విక్రయాల కోసమే నిర్మించారు. కానీ, కొద్ది కాలంగా ఈ మార్కెట్‌ను ‘రైతు బజార్‌’గా మారుస్తున్నారంటూ వదంతులు, ప్రచారాలు షికారు చేస్తున్నాయి. ఈ బూటకపు ప్రచారంతో కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. ‘‘మార్కెట్‌ స్వరూపం మారిపోతోంది.. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది.. మీ దుకాణాలు మీకు దక్కవు’’ అంటూ బెదిరింపులకు దిగి, దుకాణదారుల్లో భయాందోళనలు సృష్టించారు.
  • ‘భయానక’ వసూళ్ల పర్వం – రూ.5,000 వడ్డన..!
    ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక పకడ్బందీ ప్రణాళికతో అక్రమ వసూళ్లకు తెరలేపారు. మార్కెట్‌లోని ప్రతి దుకాణం నుంచి రూ.5,000 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ వసూళ్ల ప్రక్రియ దాదాపు 80శాతం పూర్తయినట్లు నేత్ర న్యూస్‌కు పక్కా సమాచారం అందింది. లక్షలాది రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లగా, వేలల్లో వ్యాపారం చేసే చిన్న, మధ్య తరహా దుకాణదారులు మాత్రం తమ భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా కష్టార్జితాన్ని కారుచౌకగా గుంజుకుంటున్నారు. అడిగితే బెదిరింపులు’’ అంటూ కొందరు వ్యాపారులు వాపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు వస్తే మరింత నష్టం జరుగుతుందేమోనని భయంతో చాలా మంది మౌనంగా ఉంటున్నారు.
  • తెరవెనుక అదృశ్య హస్తం.. రాజకీయం ఆశ్రయం!
    ఈ మోసం కేవలం కొందరు వ్యక్తులతో జరిగిందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక పక్కా ప్రణాళికతో, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వసూలు చేసిన మొత్తంలోంచి దాదాపు రూ. 3లక్షలు స్థానిక రాజకీయ నాయకులకు ముట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా నేత్ర న్యూస్‌కు సమాచారం అందింది. ఇది ఈ స్కామ్‌కు ఎంత పెద్ద నెట్‌వర్క్‌ ఉందో స్పష్టం చేస్తోంది. రాజకీయ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున వసూళ్లు జరగడం అసాధ్యమన్నది స్థానికుల అభిప్రాయం. ఈ నాయకులు ఎవరో, ఈ మోసానికి ఎలా సహకరిస్తున్నారో అనే అంశంపై నేత్ర న్యూస్‌ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ను రైతు బజార్‌గా మార్చాలనే ఆలోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? కేవలం భయం సృష్టించి డబ్బు వసూలు చేయడానికే ఈ ప్రచారాన్ని వాడుకుంటున్నారా? 80శాతం వసూళ్లు పూర్తయ్యాయంటే, మిగిలిన 20శాతం కూడా పూర్తి చేసేందుకు అక్రమార్కులు వేగంగా పావులు కదుపుతున్నారా? ఈ మోసానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు? వారికి రాజకీయ అండదండలు ఎలా లభించాయి? అనే నిజాలను వెలుగులోకి తీసుకురావడం అత్యవసరం.
  • మార్కెట్‌లో తక్షణ చర్యలు అవసరం..!
    ఈ మోసంపై జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలి. బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యాపారుల్లో నెలకొన్న భయాన్ని తొలగించి, వారికి భద్రత కల్పించాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి బాధితులకు అందేలా చూడాలి. లేనిపక్షంలో, ఇలాంటి అక్రమ వసూళ్లు ఇతర మార్కెట్లు, వ్యాపార సంస్థలకూ పాకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CrimeGovernment

రాజకీయా నీడలో నీరుకారుతున్న టాస్క్‌ఫోర్స్‌

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగరంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ‘టాస్క్‌ఫోర్స్‌’ పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రక్షణకై ఏర్పాటైన ఈ విభాగం ఇటీవల కాలంలో రాజకీయ పెద్దల అండదండలతో ‘నీరు కారిపోతోందా’ అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడితో సంబంధిత సిబ్బంది అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు సైతం టాస్క్‌ఫోర్స్‌ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. నేరాల నియంత్రణలో, వ్యవస్థీకృత నేరాలను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఈ ప్రత్యేక బృంద సభ్యులు కొన్ని కీలక కేసుల్లో ఎందుకు పలచబడిపోతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనుక కేవలం నిర్లక్ష్యమా..? లేక తెరవెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా..? అన్నది అంతుబట్టకుండా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో పాతనగరం సమీప ఓ పెద్ద క్లబ్‌లో పేకాట నగదుతో ఆడుతున్నట్టు నగదుతో పాటుగా లెక్కింపు యంత్రం సైతం బోర్డుపై లభించింది. ఆ సమయంలో దాడులు నిర్వహించగా కొన్ని క్షణాల్లో శాసనసభలో కీలక నేత పైరవీతో అక్కడకక్కడే వదిలి వెళ్లిపోవల్సి వచ్చింది. ఇదే విధంగా గాజువాక ప్రాంతంలో ఓ క్లబ్‌లో దాడులు నిర్వహించగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో మరోమారు వదిలిపెట్టి వెళ్లిపోయారు. టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌ సమీప ప్రాంతాల్లో కొన్ని హోటల్స్‌లో పేకాటలు ఆడుతున్నట్టు సమాచారం అందుకోని దాడిచేసిన కొన్ని నిమిషాల్లో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో వచ్చిన వేగంతోనే వెనక్కి వెళ్లిపోవడం సాధారణ విషయంగా మారిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో పలుమార్లు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించే సమయంలో సాక్ష్యాత్తు మన ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో పట్టుకొని వదిలిపెట్టిన సందర్భాలు కోకొల్లలు.

  • టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నతాధికారి కొరత..!

ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందిన టాస్క్‌ఫోర్స్‌కి ఓ ఏసీపీ స్థాయి అధికారి అవసరం ఎంతైనా ఉంది. నగర వ్యాప్తంగా గల 23 పోలీసు స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహించాల్సిన విభాగంలో కేవలం ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై ఉండటంతో టాస్క్‌లు నిర్విహించిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడం లేదు. డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారుల పర్యావేక్షణలో పని చేస్తున్నా.. స్టేషన్‌ల పరిధిలో దాడులు చేసే సమయంలో సీనియర్‌ సీఐలు మాట టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సీఐలు, ఎస్సై అప్పుడప్పుడు కొట్టలేకపోవడం ఓ కారణం అయితే.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఒత్తిడితో నిమ్మకుండిపోవడం సాధారణంగా జరుగుతుంది. పైగా రెండు జోన్‌లకు ఒకే ఎస్సై ఉండటం కూడా పని ఒత్తిడిలో కీలక టాస్క్‌లు వదిలిపెట్టడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. గతంలో ఏసీపీ స్థాయి అధికారి ఉన్నప్పటికి ప్రస్తుతానికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, గతంలో దాడులు చేయాలంటే గోప్యత ఉండేదని, ప్రస్తుతం ముగ్గురి చర్చల్లో కాలం చెల్లిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

  • నగర బహిష్కరణ చేసిన రౌడీలు రెచ్చిపోతున్నారు..!

టాస్క్‌ఫోర్స్‌ విభాగ పనితీరు నగరంలో ఈ మధ్య జరిగిన రెండు, మూడు కీలక సంఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థమయిపోతుంది. నగర బహిష్కరణ చేసిన ఓ రౌడీ షీటర్‌ ఎంవీపీ పోలీసు స్టేషన్‌ పరిధిలో బెదిరింపులకు పాల్పడుతూ ఓ భూ దందా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎట్టకేలకు సీపీ కార్యాలమంలో బాధితులు బోరుమనడంతో సంబంధిత స్టేషన్‌ పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో రుషికొండ సమీపంలో ఎండీఎం డ్రగ్స్‌ని విక్రయం చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ బృందం అదుపులోకి తీసుకుంది. తీవ్ర రాజకీయ ఒత్తిడితో ఇద్దరు నిందితులను జైలుకి సాగనంపిన సిబ్బంది మరో ఇద్దరు నుంచి భారీ మొత్తంలో దండుకొని ఉచ్చులో ఎర(డెకాయ్‌)గా ఉపయోగించామని నమ్మించి వదిలిపెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇరువురు నిందితులు మరో వ్యాపార విషయంలో గొడవ పడటంతో ఒకడ్ని మరొకడు బెదిరించడంతో టాస్క్‌ఫోర్స్‌లో చేతివాటం చూపించి ఇరువుర్ని వదిలిపెట్టిన ఆ అధికారి వద్దకు వచ్చి బోరుమన్నాడు. దీంతో ఇరువురు నిందితులను పిలిచి నచ్చచెప్పినట్టు సంబంధిత ఖాకీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. గతంలో వారానికి ఓమారు నగరంలో ఉన్న రౌడీషీటర్‌లకు కౌన్సిలింగ్‌ నిర్వహించడం, స్టేషన్‌ల వారీగా నిఘా కట్టుదిట్టం చేయడంతో పాటుగా టాస్క్‌ఫోర్స్‌ నుంచి ప్రత్యేక నిఘా ఉండేది. ప్రస్తుతం అటుగా కౌన్సిలింగ్‌లు నిర్వహించకపోవడంతో పలు హత్యకేసుల్లో నిందితుడిగా గుర్తింపు పొంది నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్‌ టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కి కూతవేటు దూరంలో తన ప్రతాపాన్ని చూపించి పోలీసులకు సవాల్‌ విసిరిన నాలుగు రోజులకు మేల్కొన్నారు.

Crime

ట్రాఫిక్ కానిస్టేబుల్ ను బెదిరించిన మేయర్ భర్తపై చర్యలు తీసుకోవాలి

నేత్ర న్యూస్, విశాఖపట్నం, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దుర్భాసలాడి బెదిరించిన మేయర్ భర్త గొలగాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం పోలీస్ కమిషనరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆరిలోవలోని తోటగరువు స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా, షాడో మేయర్ గొలగాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాసలాడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి గూబ పగల గొడతానని, సస్పెండ్ చేసి పారేస్తాను అంటూ దుర్భాసలాడిన విషయం అన్ని చానల్లో, పత్రికల్లో వచ్చాయని తెలిపారు. శ్రీనివాస్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, అధికార కార్పొరేటర్ కాదని, వైసీపీ సాధారణ కార్యకర్త అని ఏం అధికారం ఉందని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దారుణంగా దుర్భాషలాడుతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టాలపై పోలీసులపై వైసీపీ నేతలకు గౌరవ లేదని, అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. సాక్షాత్తు పోలీసులను నడి రోడ్డుపై బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఇప్పటికే షాడో మేయర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తూ జీవీఎంసీ అధికారులను బెదిరిస్తూ ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. అదే వేరే పార్టీ వారు ఇలా చేసి ఉంటే ఈ పాటికి కేసులు పెట్టేవారన్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలతో స్పందనలో ఏడీసీపీ రామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని, స్పందించిన ఆయన చర్యలు తీసుకోమని ఆరిలోవ పోలీసులకు ఆదేశించారన్నారు. పోలీసు అధికారుల సంఘం ఇప్పటికైనా స్పందించాలన్నారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

Political

జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 నేత్ర న్యూస్, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ స్థాపించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జనసేన జెండాను ఎగరవేయాగ జనసైనికులు జెండా వందనం చేశారు. అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.

అనంతరం రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనసైనికులు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన తీవ్ర నిరాశ నిసృహులకులోనై  ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో యువత పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. అందుకు ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభ విజయవంతం కావడమే నిదర్శనం అన్నారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు జనసేన అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి ఇంత మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. సుమారు 100కి పైగా జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, పీతల మదుసూదన్ రావు, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.

Entertainment

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

-నేత్రన్యూస్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకా అంశంతో సినిమా చేస్తున్నారు. అనగానే అభిమానుల్లో తెలియని ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందుతున్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా నిలిచి పోయింది. అయితే దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. హరిహర వీరమల్ల రషెష్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ క్రిష్ కి సూచించారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఒక యోధుడిగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్కుతోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే మధ్యలో ఆ సినిమా మేకింగ్ విధానంలో మార్పులు చేయాలి అని పవన్ కళ్యాణ్ అప్సెట్ అయినట్లు అలాగే వెనుకడుగు వేసినట్లుగా టాక్ అయితే వచ్చింది.

అంతే కాకుండా సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని నిర్మాత ఆర్థిక పరిస్థితుల వలన కూడా పూర్తి కాకపోవచ్చు అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎప్పటిలానే షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ ఎంతో సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకంగా ఉన్నారని సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. అలాగే పవన్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ సినిమా అప్డేట్ కూడా రావచ్చని టాక్ వస్తోంది.