Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాలు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్సీ నెంబర్ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్ కోచింగ్ సెంటర్లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.
సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.
తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
పార్కింగ్ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్న గజ దొంగలు..
నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆశీల వసూలుదారులు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్గా గుర్తింపు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్లో ఆశీలు వసూలు చేస్తున్న గుత్తేదారులు అక్కడ ప్రజలను, చిరు వ్యాపారులను దోచుకుంటున్నారని బోరున విలపిస్తున్నారు. మార్కెట్లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ జీవీఎంసీ తరుపున ఆశీలు వసూలు చేస్తున్నామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక కార్పొరేటర్ మాటకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగ గుత్తేదారులు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన
ఆస్తి పూర్ణామార్కెట్ ఒకటి. ఈ క్రమంలో జోన్-4 కార్యాలయ
పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగల కంటే ముదురు దొంగలకు అప్పగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు దిగువ స్థాయి సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్ నిబంధనలు ప్రకారం స్కూటర్ పార్కింగ్కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.200నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్లో ఎక్కడా లేని రశీదులను ముద్రించి రూ.300వరకు దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.200ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.
– మార్కెట్ని దోచుకోవడంలో ముదురులు..
జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా బి.శ్రీరామమూర్తి ఆర్సీ నెంబర్ 712/2024 పేరిట అధికారం కైవసం చేసుకొని రశీదులు సైతం ముద్రించారు. కానీ ఇక్కడ సమాన వాటాలతో పూర్ణామార్కెట్ ఆశీల వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు పాటదారులు రింగుగా ఏర్పడి వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. గెజిట్లో ఎక్కడా లేని విధంగా అనధికారికంగా జంగిడీ, తమలపాకుల వ్యాపారుల నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే పండుగ రోజుల్లో అయితే ఇష్టానుసారంగా రూ.500లకు పైగా వసూలు చేస్తున్నారు. పలువురు వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కార్పొరేటర్ భాగస్వామ్యం కూడా ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్ అవుతున్న మరో ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.
– ఎవ్వరైనా ఫిర్యాదు ఇస్తే వెంటనే రద్దు చేస్తాం..
జీవీఎంసీ గెజిట్లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఎవ్వరైనా సరే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు, కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం.
– ఎం.మల్లయ్య నాయుడు (జోన్-4 జోనల్ కమిషనర్).
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిథి): అధికారులు, అక్కడి నాయకుల పనితీరుతో ఓ వార్డులో అతిసారం రాజ్యమేలుతుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో పెద్ద, చిన్న అనే వ్యత్యాసం లేకుండా సమీప ఆసుపత్ర్రులకు పరుగులు పెట్టడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గంట గంటకు రెండు నుంచి మూడు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సుధూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి పలితం లేదని బోరుమంటున్నారు. 37వ వార్డు జబ్బరితోట ప్రాంతంలో రెండు రోజుల్లో సుమారు 15మందికి పైగా అతిసారం (డయేరియా) పంజాకు గురయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెలల తరబడి పెద్ద కుప్పగా మురుగుతున్న వ్యర్థాలను తొలిగించి వెళ్లినా అతిసారం తన తీరుని ఏ మాత్రం తగ్గించుకోలేదని కనిపిస్తుంది. స్థానిక శానిటరీ అధికారి, సిబ్బంది ఇటుగా పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న స్మశానవాటిక గోడకు ఆనుకొని నెలల తరబడి మురుగుతున్న వ్యర్థాలతో పాటుగా యూజీడీ లైన్లు పొంగి పొరలడంతో మంచినీరు కలుషితమై డయేరియాకు గురవుతున్నట్టు పలువురు వైద్యుల వివరణతో స్థానికులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆసుపత్ర్రుల్లో ఐసీయూల బాట పట్టడంతో మిగిలిన ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు. నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ నీటిని తాము కూడా సేవించామని, ఎటువంటి సమస్య లేదని అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఓ ఆలోచనలో పడ్డ ప్రజలు మరలా భయాందోళనలో పడినట్టు అయ్యింది.
– అతిసారం వలలో ఒకే ప్రాంత వాసులు ఎలా..?
ఎటువంటి నీటి కాలుష్యం జరగలేదని జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది చెప్పిన సమాధానానికి అక్కడ ప్రజలందర్ని సందిగ్ధ్ధంలో పడేసింది. ఒక ఇంట్లో అందరికీ అతిసారం లక్షణాలు కనిపిస్తే ఆహార కలుషితం అయ్యిందని అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండానే వార్డులో ఒకే ప్రాంతంలో ఉన్న సుమారు 15మందికి పైగా వ్యధి గ్రస్తులుగా మారండం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ అధికారులు, నాయకులు ఘటనా స్థలానికిచేరుకొని అక్కడ ఏర్పడిన సమస్యపై ఓ వివరణ ఇస్తే మిగిలిన ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. స్థానికంగా వ్యర్థాలు సమస్యతో పాటుగా నీటి కలుషితం పైన కూడా దృష్టి కేంద్రికృతం చేయాలని పలువురు ప్రాథేయపడుతున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్ కంటే తక్కువగా మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్ జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.
దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్ఫోర్స్మెంట్ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్ (సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్ మాస్టార్ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్ ఈ ఏడాది జీఎస్టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : ఈ నెల 28, 29 తేదీలలో జరుగనున్న జి-20 సదస్సు కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి విశాఖ నగరానికి విచ్చేస్తున్న ప్రతినిధులను, అతిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, అధికారులు తో కలిసి మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పర్యటించి పరిశీలించారు. దీనిలో భాగంగా మాధవధారలో ఉన్న పంప్ హౌస్ కు చేరుకొని దీని ద్వారా 24/7 నీటి సరఫరా ఆ ప్రాంత ప్రజలకు నిరాటంకంగా అందించడం జరుగుతుందని, నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయాలు లేకుండా వున్నాయని, ఎలక్ట్రికల్ సిస్టం ద్వారా లైన్ లోకి వెళ్లకుండానే తాగునీరు ఆపే విధానం తోపాటు ఎక్కడైనా లేఖలు ఉన్నట్లయితే త్రాగునీటి వృధా అవకుండా సిస్టం ద్వారా తెలుసుకొని అరికట్టవచ్చని ఈ పంప్ హౌస్ ఎ.డి.బి. నిధులతో ఏర్పాటు చేయడమైనదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ కు తెలిపారు. అనంతరం మూఢసరలోవ రిజర్వేయర్ లో ఉన్న సోలార్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసి, విద్యుత్ ను ఆదా చేయడమే కాకుండా, కాలుష్యాన్ని నివారిస్తూ, ఆర్ధిక లాభం జివిఎంసి పొందుతుందన్నారు. 24 గంటలు ప్రజలకు మంచి నీటి సరఫారాను అందించడం జరుగుతుందన్నారు. వేస్ట్ వాటర్ ను రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మంచి నీటిని నగరంలో గల పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా జివిఎంసి కు ఆదాయం చేకూరుతుంది అని మంత్రి ఆదిమలకు సురేష్ కు అధికారులు వివరించారు. జి.20 సంబంధించి అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాన్ని టాప్ -10 సిటీలలో ఒక సిటీగా ఉండేటట్లు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలనే స్థాయికి విశాఖ నగరం ముస్తాబ్ అవుతుందని తెలిపారు.
అనంతరం సీత కొండ బీచ్ వద్ద వ్యూ పాయింట్ ను పరిశీలించారు ఈ వ్యూ పాయింట్ను డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా (సీతకొండ) దగ్గర అనే నామకరణం చేసేందుకు ప్రతిపాదనలను మంత్రి ఆదిమలకు సురేష్, గుడివాడ అమర్నాథ్ కు తెలియజేశారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్లు రొయ్యి వెంకటరమణ, కె స్వాతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం: జీవీఎంసీ జోన్-4లో పట్టణ ప్రణాళిక కార్యదర్శిలు చేతివాటం చూపిస్తూ చెలరేగిపోతున్నారు. తాము చేసిందే చట్టంగా వార్డు స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. గతంలో చైన్మాన్లు చేసిన అవినీతికి ఏ మాత్రం తగ్గకుండా జోన్-4 టౌన్ ప్లానింగ్ పరువుని నిలబెడుతున్నారు. ఇన్ఛార్జీ ఏసీపీ, టీపీవోగా వ్యవరిస్తున్న అధికారి, తన కింద టీపీఎస్ స్థాయి సిబ్బంది సైతం ఉన్నా ఇటుగా ఒక్కసారి కూడా తొంగి చూడలేదంటే భవన యజమానులు అక్కడికి ఎన్ని ముడుపులు పంపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుమతులు లేకుంటే విద్యుత్తు, మంచి నీరు వంటి సధుపాయాలు ఇవ్వడం కుదరదని జీవీఎంసీ కమిషనర్ ఇప్పటికే ప్రకంటించినా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగువ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు రూ.లక్షలకు కక్కుర్తి పడి భవన యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. 36వ వార్డులో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పరిస్థితిపై సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి విట్టల్ను ఆరా తియ్యగా.. కాకమ్మ కబుర్లు చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును తన ఖాతాలో వేసుకొని ఆ వార్డులో ఇన్ఛార్జీ మాత్రమే చేస్తున్నాను. పూర్తిస్థాయిలో సమాచారం కావాలంటే భవనం వద్దకు వెళ్లి తెలుసుకొండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో 35వ వార్డు వెలంపేటలో నిర్మిస్తున్న మరో భారీ భవనానికి సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి శ్వేతని వివరణ కోరగా ఆ భవనానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, ఎటువంటి అదనపు అంతస్తులు నిర్మించలేదని మసిబూసి మారేడుకాయ మాటలతో తప్పించుకుంటున్నారు. ఈమెకు కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని, పైగా ఓ కార్పొరేటర్ నిర్మిస్తున్న భవనం కావడంతో తానే దగ్గరుండి అక్రమ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారని సమాచారం.
జోన్-4 పట్టణ ప్రణాళిక విభాగంలో అందరికీ సమాన వాటాలు ఉంటాయని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో ఛైన్మాన్లు చేసిన పనులను ఇప్పుడు నేరుగా టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జోనల్ కార్యాలయంలో ఉండే అధికారులకు ఓ రేటు.. తమకు మరో రేటును ముందస్తుగానే ఒప్పందం చేసుకొని దండీగా దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ విలేకరులు కలుగజేసుకొని ఆరా తీస్తే వాళ్లకు కొంత సొమ్మును కట్టబెట్టి నిర్మాణాలను శెరవేగంగా కట్టుకుంటున్నారు.
వార్డు స్థాయిలో ఓ అక్రమ నిర్మాణం నిర్మించాలంటే మొదటిగా జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వేయర్లు నకిలీ ప్లాన్లను తయారు చేసి ఓ కోడిరగ్ పద్ధతిలో సంబంధిత టౌన్ప్లాన్ంగ్ అధికారికి అందిస్తున్నారు. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి ఒప్పందం చేసే వరకు పూర్తి బాధ్యత సర్వేయర్లే తీసుకుంటారు. ఆ తరువాత ప్లానింగ్ సెక్రటరీ ద్వారా మరోమారు దాడి చేసి మరోమారు రూ.లక్షల సొమ్మును రుచి చూస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా ప్లానింగ్ కార్యదర్శి మరికొంత సొమ్ము తీసుకొని చూసి చూడనట్టు వార్డులో వ్యవరిస్తారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్కి ఉపయోగపడే సామాగ్రికి సైతం ఆతిథ్యం అందిస్తున్న పూర్ణామార్కెట్ ఇప్పుడు అభాసు పాలవుతుంది. కొంత మంది నకిలీ వ్యాపారులు చేస్తున్న చేష్టల వలన వినియోగదారులు అటుగా రావడానికి సైతం సతమతం అవుతున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు అటుగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు బోరుమంటున్నారు. రహదారిపై అనధికారికంగా తిష్టవేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న నకిలీ వ్యాపారుల వలన నిత్యం నరకయాతన పడుతున్నామని రోజువారీ వచ్చే వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు వ్యత్యాసంపై బేరాలు ఆడితే బెధిరింపులకు పాల్పడుతున్నారని, భయంతో బదులు ఇస్తే కత్తులు బయటకు తీసి దాడులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు భయంతో సమాధానం ఇచ్చింది. పెద్ద పెద్ద దుకాణాల నుంచి చిన్నపాటి జంగిడీల వరకు సుమారు 600దుకాణాలకు ఆశ్రయం ఇచ్చిన పూర్ణామార్కెట్కి ఇప్పుడు పరువు పోతుంది. 92ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు భయాందోళన కల్గిస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ జడ్జి కుటుంబం మార్కెట్కి వచ్చి పోయే సమయంలో ఓ వ్యాపారి జడ్జిపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా దాడికి ప్రయత్నించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు భార్య కూరగాయలు కొనుగోలు నిమిత్తం మార్కెట్కి వచ్చి వెళ్లే క్రమంలో ఆమెపై స్థానికంగా ఉన్న ఓ మహిళా వ్యాపారి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోవడంతో పాటుగా చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో బెధిరింపులకు పాల్పడటంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో రెండు నెలల క్రితం మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు చేస్తున్న యజమానులు మార్కెట్కి స్వచ్ఛందగా బంద్ని ప్రకటించిన నేటికి ఎటువంటి ఫలితం లేకపోయింది. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జోన్-4 జోనల్ కమిషనర్ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చోద్యం చూడటంతో పూర్ణామార్కెట్కి ఈ పరిస్థితి పట్టిందని ఓ వృద్ధ వ్యాపారి ఆరోపించారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్ పార్కింగ్ ప్రాంతంలో అక్రమంగా చేస్తున్న వ్యాపారాలను వెంటనే తొలిగించి తమకు న్యాయం చేయాలని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పూర్ణామార్కెట్కి బుధవారం సంపూర్ణ బంద్ని ప్రకటించి నిరసన చేపట్టారు. ఉదయం ఆరు గంటల సమయంలో రహదారిపై బైఠాయించిన వ్యాపారులు సంబంధిత అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సందర్భంగా సంఘ అధ్యక్షుడు కొండా రామకృష్ణ మాట్లాడుతూ పార్కింగ్ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాలకు అనుమతి లేదని, కొంత మంది కుట్రపూరిత చర్యల వలన రహదారులపై ఈ తరహా వ్యాపారాలు పెరిగిపోయాయని తెలిపారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు లేక సంబంధిత వ్యాపారులు అప్పులలో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ బంద్ని ప్రకటించి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.
మార్కెట్లో ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు అప్పులపాలైపోతుంటే కొత్తగా వస్తున్న నకిలీ వ్యక్తులు వ్యాపారులుగా మారీ రహదారులపై ఇష్టానుసారంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని దండీగా సంపాధిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో దుకాణాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం స్వచ్ఛంగా దుకాణాలకు తాళాలు వెయ్యడం 92ఏళ్లలో మొదటసారి అని పలువురు వ్యాపారులు వెల్లడిరచారు. అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతునే ఉంటామని నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఒక వైపు ఎండ తీవ్రత పెరుగుతున్న పట్టించుకోకుండా నిరసన జ్వలలను రేపారు.
పూర్ణామార్కెట్లో నిత్యం వేలాది వినియోగదారులు వస్తుంటారు. పండగల సమయంలో అసలు చూడక్కర్లేదు. అలాంటిది అక్కడ సరైన పార్కింగ్ వసతి లేదు. కార్లు వస్తే నిమిషాల పాటు ట్రాఫిక్ జాం. ఒక్కోసారి దుకాణాల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని, చిరు వ్యాపారులు సిండికేట్గా మారి తమపైనే దౌర్జన్యాలకు దిగు తున్నారని వాపోతున్నారు. పోలీసులు బీట్ కాస్తున్నా తమకు రక్షణ లేకుండా పోయిందని, జీవీఎంసీ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తనిఖీలు చేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యధిక ఆదాయం వచ్చే అలాంటి చోట అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని, మామ్మూళ్లు వసూలు చేసుకుని తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
మార్కెట్ రహదారులపై వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఎవ్వరికి కేటాయించిన దుకాణాల్లో వాళ్లు వ్యాపారాలు చేసుకుంటే అందరు బాగుంటారని వెల్లడిరచారు. నిత్యవసర సరుకులు కొనుగోలుకు వస్తున్న వినియోగదారులపై నకిలీ వ్యాపారులు దాడులకు దిగడంతో మార్కెట్ పరువు పోతుందని, ఇప్పటికైనా శాంతిభద్రతల పోలీసులు స్థానికంగా బీట్ బుక్ పెట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని ప్రాధేయ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా బీట్ సిబ్బందిని పెంచి రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలకు సిద్ధం కావాలని కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిథుల పైరవీలతో వ్యాపారాలు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. మరోసారి వ్యాపారాలు రహదారిపైకి వస్తే తాము తీసుకోవల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.
మార్కెట్ వ్యాపారులు చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు వెల్లడిరచారు. స్థానిక శాంతిభద్రతల పోలీసులతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో సహకరించారని వెల్లడిరచారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్తో పాటుగా మేయర్ నుంచి కూడా మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. నిరసనకు సహకరించిన అందరికీ ధన్యవాదలు సైతం చెప్పారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్-4లో టౌన్ప్లానింగ్ రింగ్ మాస్టర్లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్ప్లానింగ్ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4 టౌన్ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్-4 టౌన్ప్లానింగ్ సిబ్బంది, వార్డు ప్లానింగ్ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్ప్లానింగ్ చైన్మెన్ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్-4 పరిధిలో పనిచేస్తున్న చైన్మాన్లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్ప్లానింగ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్ప్లానింగ్ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.