Please assign a menu to the primary menu location under menu

Government

CrimeGovernment

పోలీస్ స్టేషన్ లో కుర్చీలాట..!

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముఖ్యంగా ఆ పోలీసు స్టేషన్లో ఓ కుర్చీ కోసం చిన్న స్థాయి యుద్ధమే జరిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎత్తులు.. పైఎత్తులు.. వేసుకుంటూ కుర్చీ కోసం పోట్లాడుకున్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆఖరికి ఎడమొహం.. పెడమొహం.. పెడుతూ సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్‌ చెంతకు చేరుకొని సమీప స్టేషన్లకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్డర్‌లు సైతం తెచ్చుకున్నారు. అయినా స్టేషన్‌ను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించక సంబంధిత సిబ్బంది నేటికి స్టేషన్‌లో సతమతం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగర వ్యాప్తంగా అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌లో కీలక పోలీసు స్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆ స్టేషన్‌లో జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ చేస్తున్న దందా తోటి సిబ్బంది నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగున అతని అవినీతి జాడలు అంటించడంతో తమ మనుగడ చాలా కష్టంగా ఉందని బోరుమంటున్నారు. ఎండకు గుక్కెడు నీరు కావాలన్నా ఆ అయ్యగారి అనుమతి కావాలన్నట్టు అక్కడి పరిస్థితులు మారిపోయాయని వాపోతున్నారు. బడా బాబులు, బజారులు, బారుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అన్ని చోట్ల పెద్ద మొత్తంలో దండుకుంటున్న అవినీతి జలగపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కన్ను పడిరదని సమాచారం. ఇదే క్రమంలో రోజువారీ స్టేషన్‌కి తీసుకొచ్చే ఓపెన్‌ డ్రిరకింగ్‌ (బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం) వంటి ఫిర్యాదుల్లో దండీగా దండుకుంటున్న సిబ్బంది ఆస్కార్‌ అవార్డును సైతం కైవసం చేసుకునే నటనను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే జీడీలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి బేరసారాలు కుదరనివి మాత్రమే.. అది కూడా పదుల సంఖ్యలో కోర్టుకు పంపించి జరిమానాలు విధిస్తున్నారని సంబంధిత స్టేషన్‌ సిబ్బంది బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. ఈ స్టేషన్‌లో ప్రతీ అంశానికి ఓ ధరను నిర్ణయించి అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌గా నడపడంతో స్టేషన్‌లో నలుగురు సిబ్బంది ఠాణా లేఖరి (స్టేషన్‌ రైటర్‌) కుర్చీ కోసం పోట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

  • ఆ పోలీసు స్టేషన్లో అంతా రాజకీయమే..
    రోజువారీ స్టేషన్‌లో జరుగుతున్న కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు సిబ్బంది ఇప్పుడు అర్జీలు పెట్టుకొని బదిలీపై వెళ్లిపోవడం అక్కడ ఉత్కంఠను తలపిస్తుంది. స్టేషన్‌కి అవసరమైన నిధులు సమకూర్చే క్రమంలో నాలుగు రాళ్లు పక్కన వేసుకునే ఇరువురు ఒకేసారి బదిలీపై వెళ్లిపోవడంపై స్టేషన్‌లో అంతర్గత రాజకీయాన్ని తలపిస్తుంది. అదే స్టేషన్‌ పరిధిలో గత ఐదేళ్లు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో పనిచేసి ఇప్పుడు అదే స్టేషన్‌లో రైటర్‌ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వద్ద ఇన్ని రోజులు రాజకీయం చేసిన వ్యక్తులు ఎందుకు కుర్చీని వదులుకున్నారో అర్థం కావడంలేదని సంబంధిత సిబ్బందే తర్జన బర్జన పడుతున్నారు.
  • నగర పోలీసు సిబ్బందిపై నిఘా ఎక్కడా..?
    నగర వ్యాప్తంగా ఉన్న 23పోలీసు స్టేషన్‌లు, అనుబంధ అధికార కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై నిఘా శూన్యంగా మారింది. స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంలో అలసత్వం చూపిస్తున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23పోలీసు స్టేషన్‌ల పరిధిలో జనరల్‌ సిబ్బంది పేరిట ముద్ర వేసుకొని ఇష్టానుసారంగా దండుకుంటున్నారని, స్టేషన్‌లో జరిగే పదవీ విరమణ కార్యక్రమాలు అంబరాన్ని అంటే సంబరంగా జరగడానికి ఈ జనరల్‌ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ఓ పోలీసు స్టేషన్‌ ఆవరణంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మద్యం పార్టీకి అధిక సంఖ్యలో మద్యం సీసాలు సమకూర్చడంలో ఈ జనరల్‌ సిబ్బంది పనితీరు స్పష్టంగా కనిపించిందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇటువంటి అంశాలపై ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌ దృష్టి కేంద్రికరిస్తే.. 2016లో పోలీసు కమిషనర్‌ టి.యోగానంద్‌ జనరల్‌ సిబ్బందిపై కొరడా ఝుళిపించిన సందర్భం గుర్తొస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Government

ప్రైవేట్ పాఠశాలల్లో పైశాచికత్వం

ఓవైపు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి.. మరోవైపు తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : చదువుల బరువు మోసి చిన్నారి మనసులు చితికి పోయే.. మార్కుల కోసం పరుగులెత్తి బాల్యం దూరమయ్యే.. అనే పదాలను పద్య రూపంలో ఓ సమకాలీన కవి నాడు చెప్పినట్టే నేడు ప్రైవేట్‌ పాఠశాలల్లో వ్యవహరిస్తున్న తీరు చిన్నారుల బాల్యాన్ని శూన్యం దిశగా సాగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పొరుగు పాఠశాలలతో పోటీ పడుతూ విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించకుండా పాఠశాల యాజమాన్యలు తీవ్ర ఒత్తిడిని కలిగించడం చాలా ప్రమాదకరమని పలువురు పరిశోధనాత్మక విద్యావేత్తలు వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ సరైన సూచనలు జారీ చేయకపోవడం, జారీ చేసిన సూచనలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య అధికంగా వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాను 11మండలాలుగా విభజించి వాటికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను కేటాయించి, ఒక్కొక్క మండలంలో కొన్ని సమూహాలు(క్లస్టర్‌లు)గా విడదీసి సీఆర్‌పీలను నియమించినా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి అన్ని అంశాల్లో మరింత చురుకుగా పాల్గొని ఆహ్లాదకరమైన విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాలలపై అసభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదులు చేస్తున్నారంటే విద్యా విధానం ఎటుగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రభుత్వం పదోవ తరగతి విద్యార్థులకు సరైన ప్రణాళికతో చదవడానికి 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌ని ప్రారంభించగా ప్రైవేటు పాఠశాలలు పాటించే తీరు విద్యార్థులను ఒత్తిడి దిశగా తీసుకెళ్తుందని పలువురు విద్యార్థులే వెల్లడిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలకే పరిమితం చేయడం, సెలవు దినాలు, ఆదివారాల్లో సైతం తరగతులు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రోధిస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించే దిశగా కొన్ని పాఠశాలలు ప్రణాళికలను రచిస్తుంటే మరికొన్ని డబ్బా పాఠశాలలు ఆర్భాటం చేయడంలోనే పనితనం చూపించి ఫలితాల్లో శూన్యం చూపిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే సెలవు దినాలు, సమయాన్ని పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవల్సిన విద్యాశాఖ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వత్తాసు పలకడంతో విద్యా వ్యవస్థ దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఫీజులు నియంత్రణ అంశాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా ఏ ఒక్కరూ అటుగా ప్రశ్నించకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి.

  • ప్రైవేట్‌ పాఠశాలలపై ఆశాఖకు అంత ప్రేమ ఎందుకో..?

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సమానంగా విద్యా విధానాన్ని రూపొందించడం, పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంశాల్లో మాత్రమే శ్రద్ధ చూపించాల్సిన విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ద్వంద వైఖరిగా వ్యవహరించడం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాల నుంచి లాభాపేక్ష అధికంగా ఉండటంతో దిగువ స్థాయిలో ఉండే సీఆర్‌పీలు, ఎంఈవోలతో కలిసి సహాయ అధికారులు, ఉన్నతాధికారులు సైతం విద్యా ప్రమాణాలు పాటించని పాఠశాలలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనార్హం. ప్రత్యేక తరగతుల పేరిట ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలలు నిర్వహించడం, పాఠశాలలోనే ప్రత్యేక బోధన పేరిట ట్యూషన్‌ తరగతులు పెట్టడం, సెలవు దినాల్లో పాఠశాలల్లో తరగతులు జరపడం వంటివి చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఫీజులు వసూల అంశపై నియంత్రణ ఉందా..?

చిన్నారులకు ఉన్నతమైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు పస్తులుండి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడంపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా విభజిస్తూ సరసమైన పద్ధతిలో ఫీజులను తీసుకోవాలని ఆదేశాలు కేటాయించినా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కూడా పట్టించుకోలేదు. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చోద్యం చూడటంపై ప్రైవేట్‌ పాఠశాలల తీరు చాలా కుటుంబాలను చిన్నాభిన్నాం చేసిందనడంలో ఆశ్చర్య పడనవసరం లేదనే చెప్పాలి. ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ప్రకారం గత మూడేళ్లుగా నర్సరీ నుంచి ఐదో తరగతికి గ్రామ పంచాయితీల్లో రూ.10వేలు, మున్సిపాల్టీల్లో రూ.11వేలు, కార్పొరేషన్‌లల్లో రూ.12వేలుగా అదే ఉన్నత విద్య 6నుంచి 10 తరగతి వరకు పంచాయితీల్లో రూ.12వేలు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ల్లో రూ.18వేలుగా కేటాయించినా అటుగా ఏ ఒక్క ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గం. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.

  • ఆర్టీఈ యాక్ట్‌2009ని ఎవరు పాటిస్తున్నారో..?

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌2009 అనేది భారతదేశంలో పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించే చట్టంగా ప్రవేశపెట్టారు. 6నుంచి 14సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు తన నివాస స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఈ పద్ధతిలో ప్రైవేట్‌ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్‌ చేయాలి. కానీ జిల్లాలో కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని నామమాత్రంగా స్వీకరించి ఉచిత సీటులను కేటాయిస్తే.. మరికొన్ని పాఠశాలలు అటువంటి అవకాశాలు లేవని ఖచ్చితంగా వెల్లడిరచాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అర్హత పొందినా విద్యార్థి వయస్సు సరిపోలేదని, ఆ చట్టం అందుబాటులో లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పుతూ తప్పించుకున్నారు. దీనిపై ఇప్పటికే గత జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. దీనిపై పాఠశాలల వారీగా పర్యవేక్షించాల్సిన దిగువస్థాయి సిబ్బంది సైతం చోద్యం చూస్తూ ఉండిపొయారు. ఒత్తిడి విద్యను అందిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలతో పాటుగా అటుగా పట్టించుకోని విద్యాశాఖ సైతం పైశాచికత్వంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

CrimeGovernmentPolitical

టాస్క్‌ ఫోర్స్‌లో మహా మాయగాళ్లు

కీలక టాస్క్‌ల్లో నిందితులకు సమాచారం చేరవేసి చేతివాటం చూపిస్తున్నట్టు పలు ఆరోపణలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్‌ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్‌ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్‌, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్‌ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్‌ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.

  • టాస్క్‌ ఫోర్స్‌లో ఆ షాడోని పట్టుకోవడం కష్టమా..?

తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్‌, బెయిల్‌ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్‌, డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్‌ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్‌ డబుల్‌ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్‌ దుకాణాలు, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.

  • టాస్క్‌ ఫోర్స్‌లో డైరెక్ట్‌ అధికారి అవసరమే..!

నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్‌ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్‌ స్టేషన్‌ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్‌ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

CrimeGovernment

పోలీసు విధుల్లో యూనిఫామ్ ధరించాల్సిందే..!

  • సిబ్బంది విధిగా యూనిఫామ్‌ ధరించాలని సీపీ ఆదేశాలు..
  • యూనిఫామ్‌ ధరించకపోతే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక..
  • జనరల్‌ సిబ్బంది సైతం యూనిఫామ్‌ ధరించాలని సూచనలు..


నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ‘‘మీ సీపీ ఎల్లప్పుడూ యూనిఫామ్‌లో ఉంటే మీరు ఎందుకు యూనిఫాంలో ఉండకూడదు. విధుల్లో ఉన్నప్పుడు 100శాతం అందరూ పోలీసు యూనిఫామ్‌లో ఉండాలి. హోంగార్డు, కానిస్టేబుల్‌ నుంచి ప్రతీ అధికారి యూనిఫామ్‌ ధరించాలి. ఎవ్వరైనా యూనిఫామ్‌లో లేకపోతే వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’’ అని సాక్షాత్తు విశాఖ నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నగర పోలీసు సిబ్బంది అందరిలో ఓ కొత్త భయాందోళన రేకెత్తించింది. అది కూడా ఎందుకంటే నగర సీపీ మాట్లాడిన మాటలతో పాటుగా ఓ దిగువ స్థాయి సిబ్బంది మరో వాయిస్‌ రికార్డుని జత చేస్తూ ‘‘ఎవరైతే జనరల్‌ డ్యూటీలో ఉన్నారో వాళ్లందరూ తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని, పైగా నిఘా కూడా ఉంది అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.’’ అని చెప్పడంతో నగర వ్యాప్తంగా స్టేషన్‌ స్థాయిలో ఇప్పటికీ జనరల్‌ డ్యూటీ (2016 మే 25న మాజీ సీపీ యోగానంద్‌ సమక్షంలో అంతరించి పోయిందని అనుకున్న ప్రత్యేక కలెక్షన్‌ బృందం) ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని విశ్వసనీయ సమాచారం. ప్రజల సమస్యలతో పాటుగా సిబ్బంది బాగోగులు చక్కగ చూస్తున్న నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ ఇప్పుడు అవినీతి ముసుగులో మగ్గిపోతున్న కలెక్షన్‌ కింగ్‌లపై పడ్డారా..? అనే భయంతో స్టేషన్‌ పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 75శాతం సిబ్బంది మంగళవారం ఉదయం యూనిఫామ్‌లో దర్శనమిచ్చారు. దీంతో పాటుగా ఎప్పుడూ పోలీసు యూనిఫాం ధరించకుండా కలెక్షన్‌ ఏజెంట్లుగా తిరుగుతూ అధిక మొత్తంలో దోచుకుంటున్న దొంగల ముఠా సభ్యులు సైతం ఒక్కసారిగా యూనిఫామ్‌ ధరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి సోమవారం సీపీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ దిగువ స్థాయి సిబ్బంది యూనిఫామ్‌ ధరించకుండా అడ్డుగా వచ్చిన సందర్భంలో నగర సీపీ అందరూ యూనిఫాం ధరించాలి అని చెప్పగా ఆ విషయం నగర వ్యాప్తంగా కలెక్షన్‌లో బిజీ బిజీగా ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టిందని ఆలస్యంగా వెలుగు చూసింది. ఏది ఏమైన నగర సీపీ అటుగా కూడా నిఘా కట్టుదిట్టం చేశారని పలు సందేహాలు సైతం వేడి వేడిగా వినిపిస్తున్నాయి.

  • జనరల్‌ సిబ్బంది చేష్టలు చిర్రెత్తి పోతున్నాయి..

నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌ల్లో జనరల్‌ (కలెక్షన్‌ నిమిత్తం) సిబ్బందిని నియమించి ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ఇప్పటికే నగర సీపీకి సైతం పీజీఆర్‌ఎస్‌లో పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. దీనిపై ఆయన తనదైన శైలిలో చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఓ స్టేషన్‌ పరిధిలో గత 20ఏళ్లుగా ఉన్న హోంగార్డు జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతూ ట్రావెల్స్‌ యాజమాన్యల నుంచి దండుకుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో హోటల్స్‌, సినిమా థియేటర్‌ల వద్ద ఈ ఏజెంట్‌ తన పనితీరుని చూపిస్తున్నాడు. ఇంకొక స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ బిల్డింగ్‌లు నిర్మించే బిల్డర్‌ల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో షిప్పింగ్‌ కంపెనీలు, కార్గో యజమానుల నుంచి సరుకును దోచుకునే దొంగల నుంచి దండుకుంటున్నారు. ఇలా నగర వ్యాప్తంగా మామూళ్లు మత్తులో ఉన్న జనరల్‌ సిబ్బందిపై ప్రస్తుత పోలీసు కమిషనర్‌ చర్యలకు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతారో అని నిజాయితీగా ఉన్న కొందరు పోలీసు సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • యూనిఫామ్‌ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు..

పోలీసు యూనిఫామ్‌ ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అంతే కాకుండా ఖాకీ రంగుకి కూడా ప్రత్యేక అర్థం ఉందని పలువురు విరమణ ఉద్యోగులు సైతం వెల్లడిస్తున్నారు. ఖాకీ రంగు దుమ్మును దాచిపెట్టడానికి ఉపయోగపడుతుందని, అంతే కాకుండా ఇది శాంతి, క్రమశిక్షణను సూచిస్తుందని వెల్లడిస్తున్నారు. పోలీసు యూనిఫామ్‌ల చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైనదని, బిటిష్‌ కాలంలో బ్రిటిష్‌ వారు భారతదేశంలో తెల్లని రంగు యూనిఫామ్‌లను ఉపయోగించేవారని కానీ అవి త్వరగా మురికి అవ్వడంతో 1847లో సర్‌ హ్యారీ లమ్స్‌డెన్‌ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. పోలీసు విభాగంలో నేటికి కొనసాగుతునే ఉంది.

  • గుర్తింపు: యూనిఫామ్‌ పోలీసును సామాన్య ప్రజల నుండి వేరు చేస్తుంది. ఇది ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
  • అధికారం: యూనిఫామ్‌ పోలీసులకు ఒక నిర్దిష్ట అధికారాన్ని సూచిస్తుంది. ఇది వారి పనిని సులభతరం చేస్తుంది.
  • శ్రేణిని నిర్వచించడం: వివిధ రకాల యూనిఫామ్‌లు పోలీసు అధికారి యొక్క శ్రేణిని సూచిస్తాయి. ఇది ఆదేశాలను అమలు చేయడంలో సహాయపడుతుంది.
  • క్రమశిక్షణ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులలో క్రమశిక్షణ పెరుగుతుంది.
  • ఏకత్వం: ఒకే రకమైన యూనిఫామ్‌ను ధరించడం వల్ల పోలీసు దళంలో ఏకత్వం పెరుగుతుంది.
  • భద్రత: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమను తాము భద్రంగా భావిస్తారు.
  • శ్రద్ధ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటారు.
GovernmentPolitical

ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కిన విద్యాశాఖ

  • పండగ సెలవుల్లో తరగతులను యధావిధిగా కొనసాగిస్తున్న ప్రైవేటు పాఠశాలలు..
  • బూటకపు నోటీసులు జారీ చేసి అటుగా పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు..
  • పాఠశాలలను తనిఖీలు చేయడంలో అలసత్వం చూపిస్తున్న ఎంఈవోలు, సీఆర్‌పీలు..
  • సెలవుల్లో సైతం తరగతులు నిర్వహించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాలు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్‌సీ నెంబర్‌ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్‌ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.

  • ఆదేశాలు తుంగలో తొక్కడంలో విద్యాశాఖ సిబ్బంది సాయం చేస్తున్నారా..?

సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్‌ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్‌పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.

  • పాఠశాలలపై ఫిర్యాదులు ఎన్ని ఇచ్చినా పట్టించుకోరేం..?

తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్‌ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్‌లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్‌లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్‌ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్‌లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్‌పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్‌ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్‌జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

GovernmentPolitical

పూర్ణామార్కెట్ ని దోచేస్తున్నారు..

  • పార్కింగ్‌ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్న గజ దొంగలు..
  • గుత్తేదారులు చేస్తున్న చేష్టలకు చిరాకు పడుతున్న వ్యాపారులు..
  • నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆశీల వసూలుదారులు..
  • రూ.2లకు బదులు రూ.10లు.. రూ.30లకు బదులు రూ.300లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్‌గా గుర్తింపు పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న గుత్తేదారులు అక్కడ ప్రజలను, చిరు వ్యాపారులను దోచుకుంటున్నారని బోరున విలపిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ జీవీఎంసీ తరుపున ఆశీలు వసూలు చేస్తున్నామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక కార్పొరేటర్‌ మాటకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగ గుత్తేదారులు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన

ఆస్తి పూర్ణామార్కెట్‌ ఒకటి. ఈ క్రమంలో జోన్‌-4 కార్యాలయ
పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగల కంటే ముదురు దొంగలకు అప్పగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు దిగువ స్థాయి సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్‌ నిబంధనలు ప్రకారం స్కూటర్‌ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.200నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా లేని రశీదులను ముద్రించి రూ.300వరకు దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.200ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.

– మార్కెట్‌ని దోచుకోవడంలో ముదురులు..

జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా బి.శ్రీరామమూర్తి ఆర్‌సీ నెంబర్‌ 712/2024 పేరిట అధికారం కైవసం చేసుకొని రశీదులు సైతం ముద్రించారు. కానీ ఇక్కడ సమాన వాటాలతో పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు పాటదారులు రింగుగా ఏర్పడి వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా అనధికారికంగా జంగిడీ, తమలపాకుల వ్యాపారుల నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే పండుగ రోజుల్లో అయితే ఇష్టానుసారంగా రూ.500లకు పైగా వసూలు చేస్తున్నారు. పలువురు వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కార్పొరేటర్‌ భాగస్వామ్యం కూడా ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్‌ అవుతున్న మరో ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.

ఎవ్వరైనా ఫిర్యాదు ఇస్తే వెంటనే రద్దు చేస్తాం..

జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఎవ్వరైనా సరే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు, కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం. – ఎం.మల్లయ్య నాయుడు (జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌).

CrimeGovernment

స్టాక్ మార్కెట్ వేడిలో సిబ్బందిపై ఫైర్..

  • స్టాక్‌ మార్కెట్‌ మత్తులో సిబ్బందిని చిత్తు చిత్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి..
  • ఆ అధికారిపై ఇప్పటికే నగర పోలీసు కమిషనర్‌కి సైతం ఫిర్యాదుల పరంపర..
  • గతంలో పలుమార్లు సస్పెండ్‌ అయినప్పటికీ ఏమాత్రం మారని ఆయన తీరు..
  • స్టేషన్‌ నుంచి బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న పలువురు సిబ్బంది..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): ఆ అధికారి ఆడిన ఆటలో అమాయక సిబ్బంది సతమతమవుతున్నామని ఏకంగా పోలీసు బాస్‌కే ఫిర్యాదుల పరంపర నడపడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయనపై కోపంతో ఓ కానిస్టేబుల్‌ కొన్ని రోజులు కనిపించకుండా పోవడం సాధారణంగా విషయంగా తీసుకుంటే.. సీఐ స్థానంలో ఉన్న మహిళా అధికారి పరుగులు పెడుతూ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేయడం అసాధారణమైన విషయంగానే పరిగణించాలని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది. మొదటి నుంచి ఆ అధికారి మాట తీరు, వ్యవహార శైలి సక్రంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల దండనకు గురవ్వడమే కాకుండా పలుమార్లు సస్పెండ్‌ అయినా ఆయన తీరు ఏ మాత్రం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంచలంచలుగా పెరుగుతూ అధికారి హోదాకి వచ్చినా కాసంత కూడా కనికారం లేదని కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు మరో కొత్త అలవాటు రావడంతో సిబ్బంది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయ్యిందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెల్‌ఫోన్‌లతో స్టేషన్‌కి వచ్చిన అధికారి నిత్యం ఓ సెల్‌ఫోన్‌లో మార్కెట్‌ సమయానుగుణంగా ఇంట్రాడే ట్రేడిరగ్‌ చేయడం, మధ్య మధ్యలో అమ్మాలా..? కొనాలా..? అనే సంభషణలు చేయడం స్టేషన్‌లో కిటికీలు, తలుపులు సైతం ఓ కంట కనిపెడుతునే ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తిట్టుల దండకం తప్పదని దీనికి సంబంధించిన పూర్తి అంశాలు సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. చీటికి మాటికి సిబ్బందిపై కస్సుబుస్సులు ఆడటంతో సిబ్బంది అక్కడక్కడ

ప్రయత్నించి బదిలీపై వెళ్లిపోవడానికి సైతం సిద్ధమవుతున్నారు. గతంలో హార్బర్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ చలానా పుస్తకాలు సృష్టించి అధిక మొత్తంలో దోచుకోవడం గుర్తించిన అప్పటి పోలీసు బాస్‌ సస్పెండ్‌ చేసినా ఆయనలో మార్పు ఏ మాత్రం కనిపించలేదనే చెప్పాలి. అక్కడికి కొన్నేళ్ల తరువాత ఇన్‌స్పెక్టర్‌ హోదాలో ఓ కానిస్టేబుల్‌ని కొట్టడంతో మరోమారు సస్పెండ్‌ అయినా దిగువ స్థాయి సిబ్బందిని ఏమాత్రం చూసుకోవడం రాలేదనే చెప్పాలి. మరో సంఘటనలో ఈయన చేసిన చేష్టలకు ఓ కానిస్టేబుల్‌ తుఫాకీ ఎక్కుపెట్టిన ఘటన ఆ రోజుల్లో అందర్నీ భయబ్రాంతులకు గురిచేసినా ఉపయోగం లేదనే చెప్పాలి. ఇదే క్రమంలో నగరంలో కీలక విభాగానికి అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కోర్టు కానిస్టేబుల్‌పై నిప్పులు చెరగడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్‌ ఎవ్వరికీ చెప్పకుండా స్టేషన్‌లో తన వస్తువులు అన్ని వదిలిపెట్టి అటుగా కనిపించకుండా వెళ్లిపోయాడని తోటి సిబ్బంది గుసగుసలాడుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ 558/2024 నమోదు చేసిన కొన్ని రోజుల్లో తిరిగి రావడంతో కథ సుకాంతం అయ్యిందనే సమయానికే ఓ మహిళా ఏఎస్సై తనకు మూడు రోజులు సెలవు కోరిన విషయంలో లేఖలో నన్ను చాలా సార్లు అవమానపరిచారు, ఆడ వాళ్లకి చాలా బాధలు ఉంటాయి అర్థం చేసుకోవాలని ప్రాధేయపడటమే కాకుండా సెలవు ఇవ్వకపోతే కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కొసమెరుపు. అదే సమయంలో మరో మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఆసభ్యకరంగా మాట్లాడటం, ఓ కానిస్టేబుల్‌ని బెధిరించడం చేసిన ఆయనపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతునే ఉంది. స్టేషన్‌లో మహిళా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ బాధితురాలు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వచ్చే సన్నివేశాలు పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో తాను కూడా ఎదుర్కొవడంతో నేరుగా ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆయోమయానికి గురిచేసిందనే చెప్పాలి. దీంతో స్పందించిన పోలీసు బాస్‌ తనపై ఉన్న అధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.

Silhouette bull versus bear mascot characters in front of a stock market or profit graph concept
  • వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కింది..

మొదటి నుంచి చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కిందని నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆయన తోటి సిబ్బంది సైతం వెల్లడిస్తున్నారు. నకిలీ ట్రాఫిక్‌ చలానాలు సృష్టించి జరిమానాలు పక్కదారి పట్టించడం, కేసులకు సంబంధం లేకుండా బస్‌ వారెంట్‌లతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించడం వంటి అంశాలు డీజీపీ స్థాయి అధికారి దృష్టిలో ఉన్నా తన తీరుని ఏమాత్రం మార్చుకోకుండా సిబ్బందిపై చిందులు వెయ్యడం ఆయనకే దక్కిందని చెప్పాలి. దీనికి తోడు కొత్తగా ఉద్యోగ సమయంలో వ్యక్తిగత వ్యాపారాలు, పెట్టుబడులపై నిబంధనలు పాటించకుండా సీసీ కెమెరాల పర్యావేక్షణలో స్టాక్‌ మార్కెట్‌ ఇంట్రాడే ట్రేడిరగ్‌ చేయడం అందులో ఎదురయ్యే సంఘర్షణల వలన దిగువ స్థాయి సిబ్బందిపై మండి పడటం ఇప్పటికే పోలీసు బాస్‌ దృష్టికి పలువురు సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ రామన్న ఉత్తరాలు సైతం వెయ్యడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన ఇటువంటి అధికారి వద్ద పని చేయడం సూది కంటిలో తాను పోయడం లాంటిదని సిబ్బంది బోరుమంటున్నారు.

GovernmentHealth

37 వార్డులో పంజా విసిరిన అతిసారం (డయేరియా)

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిథి): అధికారులు, అక్కడి నాయకుల పనితీరుతో ఓ వార్డులో అతిసారం రాజ్యమేలుతుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో పెద్ద, చిన్న అనే వ్యత్యాసం లేకుండా సమీప ఆసుపత్ర్రులకు పరుగులు పెట్టడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గంట గంటకు రెండు నుంచి మూడు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సుధూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి పలితం లేదని బోరుమంటున్నారు. 37వ వార్డు జబ్బరితోట ప్రాంతంలో రెండు రోజుల్లో సుమారు 15మందికి పైగా అతిసారం (డయేరియా) పంజాకు గురయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెలల తరబడి పెద్ద కుప్పగా మురుగుతున్న వ్యర్థాలను తొలిగించి వెళ్లినా అతిసారం తన తీరుని ఏ మాత్రం తగ్గించుకోలేదని కనిపిస్తుంది. స్థానిక శానిటరీ అధికారి, సిబ్బంది ఇటుగా పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న స్మశానవాటిక గోడకు ఆనుకొని నెలల తరబడి మురుగుతున్న వ్యర్థాలతో పాటుగా యూజీడీ లైన్లు పొంగి పొరలడంతో మంచినీరు కలుషితమై డయేరియాకు గురవుతున్నట్టు పలువురు వైద్యుల వివరణతో స్థానికులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆసుపత్ర్రుల్లో ఐసీయూల బాట పట్టడంతో మిగిలిన ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు. నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ నీటిని తాము కూడా సేవించామని, ఎటువంటి సమస్య లేదని అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఓ ఆలోచనలో పడ్డ ప్రజలు మరలా భయాందోళనలో పడినట్టు అయ్యింది.

– అతిసారం వలలో ఒకే ప్రాంత వాసులు ఎలా..?

ఎటువంటి నీటి కాలుష్యం జరగలేదని జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది చెప్పిన సమాధానానికి అక్కడ ప్రజలందర్ని సందిగ్ధ్ధంలో పడేసింది. ఒక ఇంట్లో అందరికీ అతిసారం లక్షణాలు కనిపిస్తే ఆహార కలుషితం అయ్యిందని అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండానే వార్డులో ఒకే ప్రాంతంలో ఉన్న సుమారు 15మందికి పైగా వ్యధి గ్రస్తులుగా మారండం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ అధికారులు, నాయకులు ఘటనా స్థలానికిచేరుకొని అక్కడ ఏర్పడిన సమస్యపై ఓ వివరణ ఇస్తే మిగిలిన ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. స్థానికంగా వ్యర్థాలు సమస్యతో పాటుగా నీటి కలుషితం పైన కూడా దృష్టి కేంద్రికృతం చేయాలని పలువురు ప్రాథేయపడుతున్నారు.

CrimeGovernmentPolitical

జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రచ్చ.. రచ్చ..

విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిస్ట్రార్‌లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..

– కొత్త సిబ్బంది పనితీరు, సమన్వయ లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

పర్సంటేజ్‌లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..

– అన్నీ ఉంటే 0.5% లేకపోతే 1% నుంచి మా ఇష్టమంటున్న మధ్యవర్తులు..

– జిల్లా అధికారికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే మందలింపు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్‌లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్‌ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్‌ రైటర్‌లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్‌ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్‌ రైటర్‌లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్‌లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్‌లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.

  • రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు తెలిసినా చోద్యం ఎందుకు..?
    ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే కీలక వ్యవస్థల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మొదటి ఐదు స్థానాల్లో నిలుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అటువంటి వ్యవహారాలు జరిగే కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అప్పుడప్పుడు చుట్టం చూపుగా చూడటంపై కొందరి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. అన్ని సేవలు ఆన్‌లైన్‌ పేరిట ఉన్నా సంబంధిత వ్యవహారాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎట్టకేలకు కార్యాలయాలకు దూతలుగా వ్యవహరిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్‌లనే ఆశ్రయించి నిలువుదోపిడికి గురవుతున్నారు. ఈ తరహా వ్యవహారాల దృష్ట్య ప్రస్తుత కాలంలో అవినీతి అధికారులని, సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అవకాశం లేదని తెలిసినా సంబంధిత ఏసీబీ అధికారులు అటుగా డాక్యుమెంట్‌ రైటర్‌లపై దృష్టి కేంద్రీకృతం చేయడంలో చోద్యం ఎందుకు అని పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పర్సంటేజ్‌లు పుచ్చుకునే కార్యాలయాల్లో అన్ని అంశాల గురించి పూర్తి అవగాహాన ఉన్న అవినీతి నిరోధక శాఖ చక చక పనులు ప్రారంభిస్తే ఇట్టే అవినీతి తిమింగళాలను పట్టుకోవచ్చు. ఇదే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2.ఓ పరిస్థితికి ముందు చాలా మంది అవినీతి అధికారులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టిన ఘనత ఏసీబీకి చాలా సార్లు దక్కింది. గతంలో ఇదే చోట పనిచేసి పలుమార్లు ఇదే స్థానంలో రావడానికి ఇష్టపడుతున్న అధికారులు, ఎక్కడి స్థానంలో అక్కడ ఉండిపోవడానికి అత్యాశ చూపించే గత సిబ్బంది, ఇదో ఏదో బాగుందే అని పనులు రాకపోయిన నెట్టుకొస్తున్న కొత్త సిబ్బంది తీరుని గమనిస్తే ఎంతటి స్థాయిలో అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం అయిపోతుంది. కార్యాలయ ప్రాంగణంలో అవినీతి జరగకపోయినా అవినీతికి పాల్పడిన అధికారులు దూతల ద్వారా అధిక శాతం కోరుతున్న ఘటనలు ఈ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గోడలు, కిటికీలు నిరంతరం కనిపెడుతునే ఉన్నాయి.
GovernmentPolitical

బియ్యం దొంగలు-2

  •  సర్కిల్‌-1 ఎండీయూ సిబ్బంది చేతుల్లో వేల టన్నుల బియ్యం మాయం..
  • వీఆర్‌వోల సమక్షంలో లావాదేవీలను చర్చించుకుంటున్న గజ దొంగలు..
  • ఆర్‌ఐల అండదండలతో దారితప్పుతున్న నాణ్యమైన సర్కారు సన్న బియ్యం..
  • అల్లిపురం సమీప ప్రాంతాల్లో వేల టన్నుల సరుకుని మిల్లులకు తరలింపు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా అందింస్తున్న కోటా బియ్యం పేదలకు అందకుండానే ఆమడ దూరంలో ఉన్న మిల్లులకు రూ.కోట్ల రూపాయిలకు వెళ్లిపోతున్నాయి. ఉచితంగా ఇచ్చే బియ్యంతో ఉపయోగం లేదని పేదలు రూ.10చొప్పున విక్రయాలు చేస్తున్న విషయం తెలిసి కూడా వారికి అవగాహన పరచకుండా సంబంధిత వీఆర్‌వోలు, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐలు అటుగా పట్టించుకోకపోవడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నెలవారీ మామ్మూళ్లుతో పాటుగా దాడులు చేయడానికి వస్తున్నామని డీలర్‌కి ముందస్తు సమాచారం అందించడంతో వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారని సంబంధిత ఉన్నతాధికారులే పలుమార్లు హెచ్చిరించినట్టు సమాచారం. విశాఖ అర్బన్‌ జిల్లాలో గల అన్ని సర్కిల్స్‌ కంటే సర్కిల్‌-1లో అధిక మొత్తంలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. సంబంధిత సర్కిల్‌ పరిధిలో ఉన్న జిల్లా పౌరసరఫరాల శాఖ సిబ్బందితో డీలర్లకు, ఎండీయూ (మొబైల్‌ పంపిణీ యూనిట్‌)ల సిబ్బందికి పరిచయాలు అధికంగా ఉండటంతో ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా మారి జోరుగా అక్రమ విక్రయాలు చేస్తున్నారని పలువురు దొంగ వ్యాపారులే అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైన జిల్లా యంత్రాంగంలో పెద్ద అధికారులు పట్టించుకుంటారో లేదా వేచి చూడాలి.

  •  కోటా బియ్యానికి కొత్త కొత్త రూపాలు వస్తున్నాయి..!
    పేదలకు అందించే కోటా బియ్యం కొత్త కొత్త రూపాల్లో పక్కదారి పట్టి రూ.కోట్ల రూపాయిలుగా మార్పు చెందడం విశాఖలో స్పష్టంగా గమనించవచ్చు. ఎండీయూల ద్వారా కొనుగోలు జరిగిన బియ్యం పక్కదారి పట్టడానికి చౌకధర దుకాణాల్లోనే కొత్త రూపంలో మార్పు చెందడం జరుగుతుంది. ఓ వ్యాపారి నలుపు రంగు సంచుల్లో బియ్యాన్ని తరలిస్తుంటే.. మరో వ్యాపారి పండ్ల బాస్కెట్‌లో తరలిస్తున్నారు. ఓ వ్యాపారి ద్విచక్ర వాహనంపై రెండేసి బస్తాల చొప్పున తరలిస్తుంటే.. మరో వ్యాపారి దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రకం బియ్యం బ్రాండ్‌ పేరుతో ఒకే రకమైన బియ్యం సంచులను ముద్రించి అందులో రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి అధిక ధర కలిగిన బియ్యం బస్తాల రూపంలో దర్జాగా పక్కదారి పట్టిస్తున్నాడంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బియ్యం దొంగలు నెలలో మొదటి 10రోజులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేల టన్నుల కోటా బియ్యాన్ని ఆమడ దూరంలో ఉన్న రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు.

 

  •  అందరికీ తెలిసే అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి..!
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించాల్సిన కోటా బియ్యాన్ని డీలర్లు తింటున్నారని, ఇక నుంచి నేరుగా పేదల ఇంటికే బియ్యం చేరాలని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం పక్కదారి పట్టింది. మొబైల్‌ పంపిణీ యూనిట్‌ (ఎండీయూ)ల ద్వారా బియ్యం పేదలకు చేరుతాయని ప్రభుత్వం వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. డీలర్ల కంటే రెండిరతలు అధిక మొత్తంలో ఈ ఎండీయూలు కోటా బియ్యం కొనుగోలు చేసి డీలర్ల సహకారంతో అధిక మొత్తానికి విక్రయిస్తున్న ఘటనలు వందల సంఖ్యలో ఆధారాలతో పాటుగా పట్టుబడిన సంబంధిత జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థలో లోపాలు ఉంటే ఆ పక్కనే ఉన్న పోలీసు వ్యవస్థ దానికి అనుబంధంగా ఉండే టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థల్లో సైతం సిబ్బంది నెలవారీ వచ్చే మామ్మూళ్లుకు కక్కుర్తి పడి పేదల బియ్యం అక్రమ మార్గంలో పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రెండు నెలలు పరుగులు పెడతారు అంతే..!
    రేషన్‌ బియ్యం అక్రమ మార్గంలో విక్రయిస్తున్నామని అందరికీ తెలుసు..! మా వ్యాపారంలో వచ్చే రూపాయిలో అందరికీ సగం మొత్తం పంపిణీ చేస్తాం. అందుకోసమే జిల్లా అధికారి హెచ్చరికలు జారీ చేస్తే దిగువ స్థాయి అధికారులు రెండు నెలలు పరుగులు పెట్టి ఒకరిద్దరు అమాయకపు వ్యాపారులను బలి చేస్తారు. తరువాత ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటాం. పట్టుకోవడం ఓ నాటకం.. వదిలిపెట్టడం ఒక నాటకం.. ఎవ్వరైనా ఉన్నతాధికారి తమపై ఒత్తిడి చేస్తే ఆ నాటకానికి పెట్టే కొత్త పేరు ‘అక్రమ వ్యాపారి అరెస్ట్‌’ అని పేరు మార్చి కొత్త కథ రాస్తారు. అంతే కానీ మా వ్యాపారంలో ఇటువంటి అవినీతి అధికారులు ఉన్నంత వరకు ఎటువంటి డోకా లేదు. ఎప్పటిలాగే ఎండీయూ నుంచి డీలర్‌కి.. డీలర్‌ నుంచి దళారికి.. దళారి నుంచి మిల్లు వ్యాపారికి ప్రభుత్వ కోటా బియ్యం చేరుతునే ఉంటాయి. – ఓ వ్యాపారి (కోటా బియ్యం కొనుగోలు చేసే వ్యక్తి).
1 2 4
Page 1 of 4