Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, పోలాకి రవికుమార్, పత్యేక ప్రతినిధి: సింహాద్రి అప్పన్న భూములకు సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ (ఎల్ఆర్సీ) వివాదం ప్రధానంగా పంచగ్రామాలైన వేపగుంట, అడవివరం, చీమలపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం పరిధిలో ఉంది. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 12వేల ఎకరాల భూముల్లో తరతరాలుగా 13వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1996లో అప్పటి పెందుర్తి, విశాఖపట్నం రూరల్ తహసీల్దార్లు ఈ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని పేర్కొంటూ రైతువారీ పట్టాలు జారీ చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు గ్రామాల్లోని స్థానికులు ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించడానికి రెండు జీవోలు జారీ చేశారు. జీవో సంఖ్య 578 ద్వారా కొద్ది శాతం మంది నివాసితులు తమ భూములను క్రమబద్ధీకరించుకుని దేవస్థానం నుండి ఎల్ఆర్సీ పొందారు. అయితే చాలా మందికి ఎల్ఆర్సీలు లేకపోవడంతో తమ భూములను విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేయలేక పోయారు. ఆ తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం మరో జీవో 296 ను జారీ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వైసీపీ లీగల్ సెల్ దీనిని కోర్టులో సవాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
అప్పన్న భూముల్లో భూ బకాసురులు రోజురోజుకి భరితెగిస్తున్నారు. పంచగ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అడివివరం బీఆర్టీఎస్ రోడ్డు విస్తీరణ నెపంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. భవనాలను నిర్మించే విషయంలో కొత్తగా టీడీఆర్లని చూపిస్తూ గతంలో ఇచ్చిన ఎల్ఆర్సీల మాట వినిపించకుండా చేస్తున్నారు. హైకోర్టులో అప్పన్న భూముల కేసు పరిష్కారం అయ్యే వరకు ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఆలయ అధికారులు సైతం ఆక్రమణదారులతో చేతులు కలపడంతో అప్పన్న భూములు ఆవిరైపోతున్నాయి. కొత్తగా టీడీఆర్లు ఇచ్చిన భూముల్లో ఇష్టానుసారంగా భారీ భవనాలు నిర్మించుకోవచ్చని కొలతలు వేసి మరీ.. అప్పన్న భూములను అప్పనంగా అప్పగించడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 28ఏళ్ల నుంచి ఎల్ఆర్సీలు లేనివారు భవనాలు నిర్మించకూడదని కఠిన నిబంధనలు ఉన్నా ఆలయ అధికారులు అటుగా పట్టించుకోకపోవడంతో టీడీఆర్ ముసుగులో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ వైసీపీ నాయకుడు రహదారిపై ఉన్న భవనానికి ఎల్ఆర్సీ ఉందని ఆ భవనం వెనుక ఉన్న భారీ స్థలంలో ఎల్ఆర్సీ లేకుండా కల్యాణ మండపం నిర్మించడం అందరికీ తెల్సిందే.. భవనాన్ని నిర్మిస్తున్న క్రమంలో కూటమి నాయకులు అటుగా కన్నెర్ర చెయ్యడంతో చేసేది ఏమి లేక రెండు రోజులకు ముందు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా అప్పన్న భూముల్లో అక్రమంగా ఆ భారీ భవనం నిర్మించడానికి ఆయనకు అవకాశం దక్కుతుందో.. లేదో.. వేచి చూద్దాం.
- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలు..
సింహాచలం అడివివరం రహదారి విస్తీర్ణ సమయంలో ఇచ్చిన టీడీఆర్లను ఆధారంగా చేసుకొని భారీ భవనాలు నిర్మిస్తున్నారు. రహదారి పొడుగున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలకు ఎటువంటి ఎల్ఆర్సీలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనుమతులు లేకపోయిన సంబంధిత ఆలయ అధికారులు అటుగా అడ్డగించకుండా కొలతలు వేసి మరీ భవనాలకు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం చుట్టుపక్కల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు తెల్లగొడలుగా దర్శనం ఇవ్వడం, మరికొన్ని పునాదులు, పిల్లర్లతో కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి రేకుల షేడ్లు నిర్మించి తరువాత ఆ స్థలాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.
- దుకాణాలు, పొదలు ఉన్నచోట ఎల్ఆర్సీలు ఎలా..?
పంచగ్రామాల సమస్యతో సుమారు 28ఏళ్లు పొదలతో నిండిపోయిన భూముల్లో ఇప్పుడు భారీ భవనాలు దర్శనమిస్తున్నాయి. న్యాయస్థానంలో కేసు పెండిరగ్లో ఉన్నా సంబంధిత అధికారుల పర్యావేక్షణ లోపంతో ఇప్పటి వరకు పొదల్లో ఉన్న భూములు భవనాలుగా మారిపోతున్నాయి. ఏఈవో స్థాయి అధికారులను విభాగాల వారీగా కేటాయించినా అప్పన్న భూములు కబ్జాలు ఆగడం లేదు. తాయిలాలుకు కక్కుర్తి పడుతున్న ఆలయ అధికారులు అప్పన్న భూముల్లో జరుగుతున్న వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఇప్పటికే భారీ భవనాల రూపంలో వాళ్ల తప్పులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న బడ్డీల రూపంలో ఉన్న స్థలంలో ఎల్ఆర్సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్నా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలువురు అప్పన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ వ్యవహారంలో ఎవరికి ఎంత లాభం..?
సింహాద్రి అప్పన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించడం వలన భవన యజమానులకంటే.. ఆలయ అధికారులకే అధిక లాభం దక్కుతుందని ఎల్ఆర్సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్న యజమానులు వెల్లడిస్తున్నారు. టీడీఆర్ రూపంలో వచ్చిన సొమ్ములో కొంత శాతం తమకి చదివించడంతో టీడీఆర్ ముసుగులో భవనాలు శెరవేగంగా నిర్మించుకోవాలని సూచించారని పలువురు ఆక్రమణదారులు వివరిస్తున్నారు. ఎల్ఆర్సీలు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే నోటీసు బోర్డులను ఏర్పాటు చేసిన సిబ్బంది అటుగా ఆ స్థలాల్లో భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం కొసమెరుపు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు స్వామివారి స్థలంలో దురాక్రమణదారులు శిక్షార్హులు అని ఏర్పాటు చేసిన బోర్డులు నామమాత్రంగానే ఉన్నాయి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : వరాహ నృశింహునిగా.. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా.. ద్వయ రూపాలతో వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలంలో అయోమయం సంతరించుకుంది. ఆలయ అధికారుల పర్యావేక్షణ లోపం, పనిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంతో అప్పన్న దర్శనానికి తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆలయ అధికారులు అటుగా ఆలోచనలు చేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో భక్తజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.లక్షల్లో జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు శీతల గదులకు పరిమితమైపోవడంతో తాత్కలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సిబ్బందికి ఇష్టారాజ్యమైపోయింది. రాజమార్గంగా ఉపయోగించే గాలిగోపురం వద్ద అన్ని బాధ్యతలను సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో వదిలిపెట్టడం, పీఆర్వో కార్యాలయంలో ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపయోగించడం, ఆ సిబ్బందితో పాటుగా సంబంధిత ప్రైవేటు సంస్థకు మంచి ఆదాయాన్ని అందుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామి దర్శనానికి సెక్యూరిటీ సంస్థ ప్రతినిథులు, వాళ్ళ బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది బంధువులు వస్తే వీవీఐపీ దర్శన భాగ్యాన్ని కలిగించడంలో మంచి నైపుణ్యం సంపాధించారు. ఈ అంశాలు కొందరు ఆలయ అధికారులకు తెలిసినా వాళ్ళ బంధువులకు అదే పద్ధతిలో దర్శనాలు చేయించడానికి ఉపయోగపడతారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఏది ఏమైన అధిక సంఖ్యలో సిబ్బంది కలిగిన సింహాచలంలో ప్రైవేటు సిబ్బంది పెత్తనం ముందు ముందు చాలా ప్రమాదకరం.
ఆలయ పీఆర్వో కార్యాలయంలో సిబ్బంది చక్కగా స్థిర పడ్డారనడంలో ఆశ్చర్య పడనవసరం లేదు. మూడు నుంచి ఐదు నెలలకు ఒకసారి అన్ని విభాగాల్లో సిబ్బందిని మార్పులు చేర్పులు చేసే అధికారులును సైతం తమ చేతుల్లో పెట్టుకొని పీఆర్వో కార్యాలయంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ప్రైవేటు సంస్థ నుంచి సెక్యూరిటీలుగా తీసుకున్న సిబ్బందిని పీఆర్వో కార్యాలయంలో సహాయకులుగా ఉపయోగించడంలో పెద్ద కుట్ర జరుగుతుందని, దర్శనాలు చేయించే సమయంలో భారీగా ముడుపులు అందుకుంటున్నట్టు పలు ఆధారాలు సైతం బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు రెండోసారి పీఆర్వో కార్యాలయానికి వెళ్లకుండానే వ్యక్తిగత నెంబర్లను ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ స్థిర పడిపోయిన సిబ్బంది మార్పుతోనే సాధ్యపడుతుందని పలువురు భక్తులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పన్న స్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందులు అక్కడ సిబ్బంది కొరత కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో తాత్కాలిక నాయిబ్రాహ్మణ సిబ్బందిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 69మంది సిబ్బందితో కొనసాగుతున్న కేశఖండనశాలలో 5గురు మాత్రమే పూర్తిస్థాయి ఆలయ ఉద్యోగులు కావడం, మనిషికి 60టికెట్లు చొప్పున ఐదుగురికి రోజుకి 300 టికెట్లకు గాను రూ.12వేలుని ఆలయానికి ఇచ్చి మిగిలిన మొత్తం అక్కడి నాయిబ్రాహ్మణులు సమాన వాటాలతో సొమ్ము పంచుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శని, ఆదివారం వంటి వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో భక్తులు అధికంగా వచ్చే సమయంలో రద్దీ తీవ్రంగా ఉండగా అధిక మొత్తం సంపాధించాలనే ఉద్ధేశంతో పొరుగు సిబ్బంది రాకుండా ఇక్కడ కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారని సమాచారం.
స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్వామి హుండీల్లో చెల్లించిన ముడుపులుకంటే ఆలయ సిబ్బందికే ఎక్కువ కానుకలు చెల్లిస్తున్నారు. గాలిగోపుం గుండా స్వామిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ధర చెల్లించిన భక్తులతో పాటుగా ప్రోటోకాల్ భక్తులను పంపించాలని నిబంధనలు ఉన్నా.. కాసుల కక్కుర్తిలో గాలిగోపురం గుండా పైరవీలు చేసే వ్యక్తులకు, కానుకలు ఇచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించకుండా ప్రైవేటు సెక్యూరిటీలకు పెత్తనం ఇవ్వడంతో వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా తయారైయింది. దీనికి తోడు తాత్కాలిక సిబ్బంది టికెట్లు తియ్యకుండా సగం తీసుకొని దొంగ మార్గంలో భక్తులను దర్శనాలకు పంపిస్తున్నట్టు ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారి స్పందిస్తారో..? లేదో..? వేచి చూడాలి.
చందనోత్సవంలో ఏర్పాట్లు..?
స్వామివారి ఆలయంలో తీవ్ర రద్దీని తలపించే చందనోత్సవ కార్యాక్రమంలో ఆలయ అధికారుల పనితీరు రెండేళ్లు క్రితం జరిగిన ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఇంచార్జి స్థాయిలో ఎటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదని మడికట్టుకొని కూర్చున్న ఉన్నతాధికారి తీరుకి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అని పలువురు సిబ్బంది అయో మయానికి గురవుతున్నట్టు అనుమనాలు వ్యక్త పరుస్తున్నారు.
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటుగా రవాణా, భద్రత, తాగునీరు, దర్శనం, వసతి, వైద్యం, ప్రసాదం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఆ రోజున రూ.300, రూ.1000, రూ.1500 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లు ఆఫ్లైన్తో పాటుగా www.aptemples.ap.gov.in లో
విక్రయిస్తున్నారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మార్గశిర మాస మహోత్సవాల్లో రెండోవ గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాధిగా తరలివచ్చారు. తొలి పూజతో ప్రారంభమైన విశేష పంచామృతాభిషేకాలు భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమేపి అధికమవ్వడంతో క్యూలైనుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సర్వదర్శనం క్యూలైనులో భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కనకమ్మను దర్శించుకునేందుకు సూధూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆలయ కార్యానిర్వాహక అధికారిణి చేసిన ఏర్పాట్లును ఓవైపు దేవాదాయశాఖ సిబ్బంది, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. దీంతో ఎక్కడక్కడ క్యూలైన్ల్లో కుమ్ములాట జరిగింది. రూ.500 దర్శన మార్గంలో అడుగడుగున అక్రమ మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ వారే హుందాతనాన్ని అనుభవిస్తూ క్యూలైన్లను తొలిగించి తమ అనుచర గణాన్ని దర్శనానికి తీసుకెళ్లడంతో రూ.500 టికెట్ని కొనుగోలు చేసిన భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపించింది. ఒకేసారి పదుల సంఖ్యలో పక్కదారి నుంచి పట్టుకుపోతున్న తీరుని సాధారణ భక్తులు జీర్ణించుకోలేక ఆసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో చెదురుమదురు ఘటనలు ఎదురవ్వకూడదని ముందుగానే సూచనలు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్ ఆదేశాలను సైతం దిగువ స్థాయి సిబ్బంది తుంగలో తొక్కి కద్దర్ చొక్కాలకు, బంధు ప్రీతికి లొంగిపోవడంతో అసలు సమస్య ఎదురైయిందని అమ్మవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
నేత్ర న్యూస్, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..
ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం: బ్రాహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి రచించిన మూడు జ్యోతిష్య గ్రంథాలను శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైందవ ధర్మ ప్రచారంలో భాగముగా వేద విహితమైన జ్యోతిష వాస్తు, ప్రశ్న శాస్త్ర గ్రంధాల ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సుఖమయ జీవనాన్ని సాగించాలని ఆయన అన్నారు. అక్కయ్యపాలెం శంకరమఠంలో పాతగాజువాక జ్యోతిష సరస్వతీ పీఠం నిర్వాహకులు గ్రంధకర్త దైవజ్ఞ రత్న, జ్యోతిష్య విజ్ఞాన భాస్కర్, జ్యోతిష్య వాస్తు విభూషణ్ పండిత నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి తెలుగులో అనువదించిన మహాపండిత పద్మప్రభుసూరి ప్రణీత “భువన దీపిక” (13వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత మహారాజు శంభుసింహ ప్రణీత “ప్రశ్న జ్ఞాన ప్రదీప” (15వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత సుఖదేవ చతుర్వేది ప్రణీత “మూక ప్రశ్న విచార” రచనలను సువర్ణ దివ్య హస్తములతో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ అత్యంత ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలను అందరు చదువుకునే విధంగా తెలుగులో అనువాదించడం శుభ పరిణామమన్నారు. నిర్వాహకులు ఆశ్లేష ఆచార్యులు, వెంకట సూర్యచార్యులు, వెంకట యోగాచార్యులు జ్యోతిష్య, వాస్తు విద్యాలయం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చెయ్యాలని స్వామివారు ఆశీర్వదిస్తూ సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జ్యోతిష్య పండితులు మధురపాల శంకర శర్మ, పాత్రికేయులు పుచ్చా శ్రీనివాసరావు, కొప్పరపు కవుల కళా పీఠం అధినేత మాశర్మ, మోహన్ పబ్లికేషన్స్ అధినేత రామచంద్రరావు అనేకమంది జ్యోతిష్య పండితులు, శాస్త్రాభిలాషులు పాల్గొన్నారు. కార్యక్రమములో నాగులకొండ సూర్యాచారి గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.. కొంగు బంగారం చేసే తల్లి.. బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస మహోత్సవ ఏర్పాట్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 24నుంచి డిసంబర్ 23వరకు జరుగు మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశామని సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. సంబరాలకు సంబంధించిన విషయాలను వెల్లడిరచడానికి శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్మకర్తల మండలి సభ్యుల వర్గం, ఆలయ అధికారిక వర్గం మధ్యలో జరిగిన ఘర్షణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించిందంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ఆలయంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న విభేదాల ఉత్సవం విలేకరుల సమావేశంలో బహిరంగం అయిపోయింది. ఒక వర్గం ప్రత్యర్థి వర్గంపై దాడి చేసే విధంగా మాట్లాడంతో మరో వర్గం దీటుగా ఎదుర్కొన్నట్టు మాట్లాడటం వలన కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారిణి చేస్తున్న వ్యవహారంలో రెండేళ్ల పాటుగా ఉండే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదని ఆవేదనతో ఆ వర్గం పెద్దగా గొడవ చేయడంతో.. అన్ని అంశాల్లో గౌరవ స్థానాన్ని కేటాయిస్తున్నామని ఆలయ ఈవో సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య జరిగిన విశ్లేషణాత్మక విద్వాంశంలో విలేకరులు పెద్దల పాత్రను పోషించారు. ధర్మకర్తల మండలి సభ్యుల్లో.. సభ్యులకు ఇప్పటి వరకు సవాలక్ష తగాదాలు ఉండగా ఆ వ్యవహారం కాసంత ముదిరి ఆలయ అధికారులకు కూడా తాకడంతో రెండు వర్గాలుగా తయారవ్వడంతో అసలు తంతు ఇక్కడే మొదలైంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : భక్తుల కోర్కెలను తీర్చే భగవంతునికే కష్టాలు తప్పడం లేదు. ఆయన కొలువైన మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ అగమ్యగోచరాన్ని తలపిస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రధమ దేవాలయంగా పేరుగాంచిన సింహాచలం శ్రీ అప్పన్న స్వామి అనుసంధాన దేవాలయం భైరవకోన కాలభైరవుడు కష్టాల మార్గంలో కొలువై ఉన్నారు. అమావాస్య పూజునిగా పేరొందిన కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ ప్రజలకు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయంటే ఆశ్చర్యం చెందనవసరం లేదనే చెప్పాలి. మాసంలో అమావాస్య రోజున స్వామి దర్శనానికి సుధూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఓ వైపు ప్రధాన రహదారి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖకు చెందిన ప్రాంతంలో రాకపోకల మార్గం నిర్మించడానికి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని.. అంతటిని సైతం దాటుకొస్తున్న భక్తులకు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయని మండిపడుతున్నారు. స్థానిక సిబ్బందితో పాటుగా సింహాచలం దేవాస్థానం నుంచి డిప్యూటేషన్పై విధులకు వస్తున్న ఆలయ సిబ్బంది చూపిస్తున్న బంధు ప్రీతి ప్రజలను గంటల తరబడి క్యూలైనుల్లో నిలబెట్టిస్తుంది. కిలో మీటర్ దూరం క్యూలైన్లో ఉన్న భక్తులు గంటలు గడుస్తున్నా ఆ కిలో మీటర్ దూరానికే పరిమితం అవ్వడం వలన భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆలయ ఉన్నతాధికారులు సరైన పద్ధతులను అవలంభించక పోవడంతో అడుగడుగున భక్తులు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఆలయం వద్ద పైరవీలు పర్వం పెరిగిపోవడంతో క్యూలైనుల్లో పడిగాపులు కాస్తున్న భక్తులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోతున్న ఘటనలు కోకొల్లలు. చిల్లరకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది ఉన్నంత వరకు ఈ ఆలయ అభివృద్ధి అడవి మధ్యలోనే ఉంటుందని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ఈమధ్య పదుల సంఖ్యలో కార్యనిర్వహణాధికారులు మారుతున్న ఈ అరణ్య మార్గంలో ఉన్న కాలభైరవునికి సరైన రోడ్డు మార్గాన్ని నిర్మించలేకపోతున్నారని పలువురు ప్రజలు పరుషంగానే ప్రశ్నిస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ):రోజు రోజుకి భక్తజనం నుంచి విశేష ఆదరణ నోచుకుంటున్న బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కల్తీల లీలలు ఎక్కువైపోయాయి. ఉద్యోగం ముసుగులో చేస్తున్న మాయ పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు సైతం పసిగట్టడం లేదంటే నిర్వహణలో డొల్లతనం డబ్బాల్లో దాచిపెడుతున్నట్టు ఇట్టే అర్థమైపోతుంది. డొల్లతనం.. డబ్బాల్లో దాచిపెట్టడం ఏంటో అని ఆశ్చర్యం చెందనవసరం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆలయంలో కీలకమైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సన్నివేశాలు ఆనోట.. ఈనోట.. బయటకు పొక్కకుండ, పత్రికల్లో ముద్రించి రాకుండ ఉంటే చాలు అన్ని అక్కడే పరిష్కరం అయిపోతాయి. కనకమ్మ అమ్మవారు కోర్కెలు తీర్చినట్టు అక్కడి చోటా మోటా అధికారులు అన్నిటిని పరిష్కరిస్తారు. ఆలయంలో జరుగుతున్న చోరీలు.. అసభ్యకరమైన పనులు, అమ్మవారి ఆదాయన్ని పక్కదారి పట్టించడం, ప్రసాదాల కార్ఖానా నుంచి సరుకులు ఖాళీ అవ్వడం వంటి అన్ని అంశాలు అక్కడే పరిష్కరించి అమ్మవారి ఆదాయాన్ని గండికొడుతున్నారు. ఈ అంశాలు ఉన్నతాధికారులకు తెలియక తెలిసిన అటుగా పట్టించుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు భక్తులతో పాటుగా ఆలయంలో పని చేస్తున్న సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు.
– పాల ప్యాకెట్లు పక్కదారి పడుతున్నాయి..
ఆలయంలో దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేస్తున్న చేష్టలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి గతంలో పాలాభిషేకం నిర్వహించేవారు. ఈ మధ్య కరోనా నుంచి అటువంటి పద్ధతిని పట్టాలు ఎక్కించడంతో భక్తులు తీసుకొచ్చిన పాల ప్యాకెట్లు ఆ పక్కనే ఉన్న డబ్బాలో వెయ్యడంతో అసలు కథ అక్కడే మొదలైయింది. ఆ పాల ప్యాకెట్లును అక్కడే పని చేస్తున్న దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలిక సిబ్బంది పలుమార్లు పదుల సంఖ్యలో పక్కదారి పట్టించడం సంబంధిత అధికారుల దృష్టికి వచ్చినా దోచుకున్న సిబ్బందిని దాగుడుమూతల ఆటలో దొంగల పేరిట వదిలిపెట్టడంపై విమర్శలు వస్తునే ఉన్నాయి. దీనిపై పైస్థాయి అధికారులు ఏమైన స్పందించి చర్యలు తీసుకున్నారా..? అని ఆరా తీస్తే నాలుగు గోడల మధ్య రహస్య ఒప్పందాలు జరిగినట్టు జరిగి అసలైన దొంగల చేతికే తాళాలను కట్టబెట్టారని పలువురు ఆలయ సిబ్బంది వాపోతున్నారు. కాసేపు పాల ప్యాకెట్లు విషయం పక్కన పెడితే ఆలయంలో ఎప్పటికప్పుడు మాయమవుతున్న పసాదాల తయారీ వస్తువులు, ఆయిల్ ట్యాంక్లు, ఓ ప్లాస్టిక్ దుకాణం ఇస్తున్న ప్లాస్టిక్ వస్తువులు, హుండీ ఆదాయం, పైరవీల పర్వం ఇలా ఒకటా..? రెండా..? లెక్కకు మించి జరుగుతున్నాయని సంబంధిత సిబ్బందే కస్సు బుస్సు లాడుకుంటున్నారు.
– సిబ్బంది పైరవీలు పెరిగిపోతున్నాయి..
నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో పైరవీలు జరగడం కొంత సాధ్యమైన విషయం. కానీ ఈ అమ్మవారి ఆలయంలో సిబ్బంది చేస్తున్న నయా దందా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తెల్లటి చొక్కా.. తెల్లటి పంచె.. కట్టుకున్న సిబ్బంది ఆలయం బయట తిరుగుతూ వచ్చి పోయే భక్తులకు సుపరిచితం. దీనికి కారణం గతంలో ఆ భక్తులు ఈ సిబ్బంది ద్వారా దొంగ మార్గంలో అమ్మవారి దర్శనం చేసుకున్నవారు కాబటి.్ట.! ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల నుంచి ముందస్తుగా కొంత సొమ్మును తీసుకొని వీఐపీ, వీవీఐపీ దర్శనం కల్పించడం ఈ సిబ్బందికే దక్కింది. ముందుగా సొమ్ము చెల్లించిన భక్తులను ప్రధాన మార్గంలో వీఐపీ మాదిరి తీసుకొని వెళ్లి ఆలయ గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి అదే మార్గంలో బయటకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఈ క్రమంలో ఆ సిబ్బందికి ఇంచు మించు భక్తుల సంఖ్యను బట్టి వేలల్లో ముడుపులు అందుతాయని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇదే క్రమంలో ఎవ్వరైన వేరొక ఉద్యోగి ఎవ్వరు..? అని అడిగితే ఉన్నతాధికారుల బంధువులు, పోలీసు అధికారుల చుట్టాలు, ప్రోటోకాల్, పొట్లకాయ అని లోపలికి తీసుకెళ్లి అమ్మవారి చెందాల్సిన చందా సొమ్మును కాజేస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘నేత్ర న్యూస్’ నిఘా పెట్టగా ఆ ఉద్యోగి పరుశంగా మాట్లాడటం కొస మెరుపు.
– ఆలయంలో ప్లాస్టిక్ సామాగ్రి మాయం..
బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ధన రూపేనా, వస్తు రూపేనా వచ్చే ఆదాయాన్ని వాటాలు వేసుకొని పంచుకోవడం పలుమార్లు సిబ్బంది మధ్య పెద్ద పెద్ద గొడవులు సైతం వచ్చాయి. ఆలయానికి అర్ధ కిలో మీటర్ దూరంలో గల పూర్ణామార్కెట్ కూడలి ఓ ప్లాస్టిక్ దుకాణ యజమాని ఆలయంలో అవసరాల నిమిత్తం ప్రతీసారి విరాళంగా ఇచ్చే ప్లాస్టిక్ వస్తువులు లెక్కల్లో చూపించకుండానే లెక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవడం పలుమార్లు జరిగాయని అక్కడి సిబ్బంది మాట్లాడుకుంటున్న గుసగుసల్లో గుట్టు బయటపడిరది. ఈ విషయంలో కొందరు అధికారుల చేతులు సైతం చక్కబెట్టు కోవడానికి గతంలో ప్రయత్నించాయని, అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులే చేస్తున్నప్పుడు తాము చేయడం తప్పులేదని తెలివిగా చెప్పుతూ తప్పించుకుంటున్నారు.
– వ్రతాల సొమ్ము జేబులోకి వెళ్తుంది..?
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాల సొమ్ము సిబ్బంది సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. గతంలో ఈ వ్రతాల సొమ్ము విషయంలో ఇద్దరు అధికారుల మధ్యలో చిచ్చు రేగిందని వినికిడి. ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాలకు తీసుకునే రుసుము తమ జేబుల్లోకి వేసుకొని లెక్కలు తరువాత చెప్పే విధంగా సొంతానికి వాడుకుంటున్నారని అక్కడి సిబ్బందే చెప్పుతూ ఉంటారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతుందని, ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయమై పట్టించుకోలేదని సమాచారం. నూతనంగా వచ్చిన ఆలయ ఈవో కె.శిరిషా (సహాయ కమిషనర్) ఈ మధ్య ఓ ప్రకటనలో తెలిపినట్టు ఆలయాల్లో ఆడిట్ విధానం తప్పని సరీ.. అన్నట్టు ఈ ఆలయంలో ఆడిట్ విధానం పాటిస్తే నక్కి నక్కి ఉన్న దొంగలు ఒక్కసారిగా బయట పడటం కాయం.
– కార్ఖానాలో ప్రసాదాల సరుకులు స్వాహా..
ఆలయంలో నిరంతర పర్యావేక్షణ లేకపోవడం ప్రసాదాల కార్ఖానాలో చాలా సామాగ్రిని సొంతానికి ఉపయోగించు కుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లుతో పాటుగా పప్పులు, ఉప్పులు తప్పుడు మార్గంలో బయటకు వెళ్లడం ఇక్కడ సాధారణ విషయమని వెల్లడిస్తున్నారు. పాత డబ్బాల్లో సరుకులు కొత్త రూపాన్ని సంతరించు కుంటున్నాయని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే క్రమంలో ఆలయానికి రాలేని భక్తులు బయట ఉన్న ఇనుప ఊచల మధ్యలో నుంచి ఇచ్చిన చిల్లర సొమ్మును సైతం హుండీల్లో వెయ్యకుండా సిబ్బంది చేతులు మారుస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం: నగరంలో టౌన్ కొత్తరోడ్డు ప్రాంతంలో కొలువైవున్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం రథోత్సవానికి సిద్ధమవుతోంది. జులై 1 నుంచి స్వామి తొలిరథయాత్ర ప్రారంభం రథయ కానుంది. తిరుగురథయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ కార్యనిర్వాహణాధి కారిణి సాదనాల ప్రసన్నలక్ష్మీ, ఓ ప్రకటనలో తెలిపారు.
– జగన్నాథ స్వామివారి ఆలయ చరిత్ర..
నగరంలోని శ్రీజగన్నాథస్వామి దేవాలయానికి 190 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ.1832లో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రాంతంలో గరుడా జగన్నాయకులు వారి కుటుంబీకులు తవ్వకాలు జరిపినప్పుడు ప్రస్తుతం దేవాలయం ఉన్నచోట మహావిష్ణువు రూపుడైన రంగనాథ స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. దీంతో స్వామికి చిన్న తాటాకుల పందిరి వేసి దాంట్లో చలమయ్య దీక్షితులు అర్చకులుగా నియమించారు. ఆ తరువాత గరుడ వంశీయుల ఆరాధ్యదైవమైన జగన్నాథస్వామికి ఆలయం నిర్మించడానికి పూనుకొని క్రీ.శ. 1862లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ నుంచి శ్రీజగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్టించారు. 1864 నుంచి నేటి వరకు రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
– రథం చూడటానికి రారండయ్..!
ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విదియ రోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ప్రారంభిస్తారు. ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయం నుంచి ట్రర్నర్ సత్రం వరకు రథోత్సవం నిర్వహించి, సత్రంలో పదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.
ఆ ప్రాంతంలో స్వామివారు దశావతారాల్లో భక్తులకు
దర్శనమిస్తారు.
– దశావతారాల్లో జగన్నాథ స్వామి..
జులై 1న స్వామివారి తొలి రథయాత్ర
2 – మత్స్యావతారం
3 – కూర్మావతారం
4 వరాహావతారం
5 – నృసింహావతారం
6 వామనావతారం
7 – పరశురామావతారం
8 – రామావతారం
9 – బలరామ, కృష్ణావతారం
10 – శేషపాన్పు అవతారం
11 – తిరుగు రథయాత్ర
– స్వామి దర్శనానికి బస్సు సౌకర్యం..
స్వామివారి రథోత్సవం సందర్భంగా టర్నర్ సత్రం (గుండిచా దేవి ఆలయం)లో ఈనెల 01 నుంచి 11వ తేదీ వరకు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 6, 6సీ, 12, 123, 14, 16, 1729, 20, 20, 25, 258, 256, 2508, 256/65. 253, 36, 48, 48, 526, 52, 528, 525/5, 60, 60సీ, 60హెచ్, 64ఎ, 65ఎఫ్, 66వ, 99, 99ఎ/సీ, 993, 333 నెంబరు గల బస్సులు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయి.
– ఏర్పాట్లు ముమ్మరం చేశాం..
ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా ప్రత్యేక దర్శనం రూ.20, శీఘ్ర దర్శనం రూ.50, విశిష్ఠ దర్శనం రూ.200ల దర్శన లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. గుండిచా దేవి ఆలయం (టర్నర్ సత్రం) వద్ద ఎటువంటి పైరవీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోజువారీ 500నుంచి వెయ్యి మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. – సాదనాల ప్రసన్నలక్ష్మీ (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).