Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): ఆ అధికారి ఆడిన ఆటలో అమాయక సిబ్బంది సతమతమవుతున్నామని ఏకంగా పోలీసు బాస్కే ఫిర్యాదుల పరంపర నడపడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయనపై కోపంతో ఓ కానిస్టేబుల్ కొన్ని రోజులు కనిపించకుండా పోవడం సాధారణంగా విషయంగా తీసుకుంటే.. సీఐ స్థానంలో ఉన్న మహిళా అధికారి పరుగులు పెడుతూ పోలీసు కమిషనర్కి ఫిర్యాదు చేయడం అసాధారణమైన విషయంగానే పరిగణించాలని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది. మొదటి నుంచి ఆ అధికారి మాట తీరు, వ్యవహార శైలి సక్రంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల దండనకు గురవ్వడమే కాకుండా పలుమార్లు సస్పెండ్ అయినా ఆయన తీరు ఏ మాత్రం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంచలంచలుగా పెరుగుతూ అధికారి హోదాకి వచ్చినా కాసంత కూడా కనికారం లేదని కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు మరో కొత్త అలవాటు రావడంతో సిబ్బంది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయ్యిందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెల్ఫోన్లతో స్టేషన్కి వచ్చిన అధికారి నిత్యం ఓ సెల్ఫోన్లో మార్కెట్ సమయానుగుణంగా ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం, మధ్య మధ్యలో అమ్మాలా..? కొనాలా..? అనే సంభషణలు చేయడం స్టేషన్లో కిటికీలు, తలుపులు సైతం ఓ కంట కనిపెడుతునే ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తిట్టుల దండకం తప్పదని దీనికి సంబంధించిన పూర్తి అంశాలు సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. చీటికి మాటికి సిబ్బందిపై కస్సుబుస్సులు ఆడటంతో సిబ్బంది అక్కడక్కడ
ప్రయత్నించి బదిలీపై వెళ్లిపోవడానికి సైతం సిద్ధమవుతున్నారు. గతంలో హార్బర్ స్టేషన్లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ చలానా పుస్తకాలు సృష్టించి అధిక మొత్తంలో దోచుకోవడం గుర్తించిన అప్పటి పోలీసు బాస్ సస్పెండ్ చేసినా ఆయనలో మార్పు ఏ మాత్రం కనిపించలేదనే చెప్పాలి. అక్కడికి కొన్నేళ్ల తరువాత ఇన్స్పెక్టర్ హోదాలో ఓ కానిస్టేబుల్ని కొట్టడంతో మరోమారు సస్పెండ్ అయినా దిగువ స్థాయి సిబ్బందిని ఏమాత్రం చూసుకోవడం రాలేదనే చెప్పాలి. మరో సంఘటనలో ఈయన చేసిన చేష్టలకు ఓ కానిస్టేబుల్ తుఫాకీ ఎక్కుపెట్టిన ఘటన ఆ రోజుల్లో అందర్నీ భయబ్రాంతులకు గురిచేసినా ఉపయోగం లేదనే చెప్పాలి. ఇదే క్రమంలో నగరంలో కీలక విభాగానికి అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కోర్టు కానిస్టేబుల్పై నిప్పులు చెరగడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఎవ్వరికీ చెప్పకుండా స్టేషన్లో తన వస్తువులు అన్ని వదిలిపెట్టి అటుగా కనిపించకుండా వెళ్లిపోయాడని తోటి సిబ్బంది గుసగుసలాడుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎంపాలెం పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ 558/2024 నమోదు చేసిన కొన్ని రోజుల్లో తిరిగి రావడంతో కథ సుకాంతం అయ్యిందనే సమయానికే ఓ మహిళా ఏఎస్సై తనకు మూడు రోజులు సెలవు కోరిన విషయంలో లేఖలో నన్ను చాలా సార్లు అవమానపరిచారు, ఆడ వాళ్లకి చాలా బాధలు ఉంటాయి అర్థం చేసుకోవాలని ప్రాధేయపడటమే కాకుండా సెలవు ఇవ్వకపోతే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కొసమెరుపు. అదే సమయంలో మరో మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఆసభ్యకరంగా మాట్లాడటం, ఓ కానిస్టేబుల్ని బెధిరించడం చేసిన ఆయనపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతునే ఉంది. స్టేషన్లో మహిళా ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ బాధితురాలు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వచ్చే సన్నివేశాలు పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో తాను కూడా ఎదుర్కొవడంతో నేరుగా ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆయోమయానికి గురిచేసిందనే చెప్పాలి. దీంతో స్పందించిన పోలీసు బాస్ తనపై ఉన్న అధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.
మొదటి నుంచి చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కిందని నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆయన తోటి సిబ్బంది సైతం వెల్లడిస్తున్నారు. నకిలీ ట్రాఫిక్ చలానాలు సృష్టించి జరిమానాలు పక్కదారి పట్టించడం, కేసులకు సంబంధం లేకుండా బస్ వారెంట్లతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించడం వంటి అంశాలు డీజీపీ స్థాయి అధికారి దృష్టిలో ఉన్నా తన తీరుని ఏమాత్రం మార్చుకోకుండా సిబ్బందిపై చిందులు వెయ్యడం ఆయనకే దక్కిందని చెప్పాలి. దీనికి తోడు కొత్తగా ఉద్యోగ సమయంలో వ్యక్తిగత వ్యాపారాలు, పెట్టుబడులపై నిబంధనలు పాటించకుండా సీసీ కెమెరాల పర్యావేక్షణలో స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం అందులో ఎదురయ్యే సంఘర్షణల వలన దిగువ స్థాయి సిబ్బందిపై మండి పడటం ఇప్పటికే పోలీసు బాస్ దృష్టికి పలువురు సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ రామన్న ఉత్తరాలు సైతం వెయ్యడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన ఇటువంటి అధికారి వద్ద పని చేయడం సూది కంటిలో తాను పోయడం లాంటిదని సిబ్బంది బోరుమంటున్నారు.
విశాఖపట్నం జాయింట్ సబ్ రిస్ట్రార్లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..
పర్సంటేజ్లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్లైన్ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్ రైటర్లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్లపై పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభించిన దాడులు ఉరుకులు పరుగుల నడుమ జరుగుతునే ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఏజీడీ డాక్టర్ ఎ.రవి శంకర్ నాటి నుండే తనదైన శైలిలో విధులు నిర్వహించడం ప్రారంభించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాలి. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన విభాగంలో ప్రత్యేక నిఘా కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం మరిచిపోక ముందే రెండు రోజుల క్రితం నగరంలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేసిన తీరుతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో తన సిబ్బందితో పాటుగా నగరంలో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆయన ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసుకున్న టాస్క్ని సిబ్బందికి ఇచ్చారు. నగరంలో చట్ట విరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలను గుర్తించి దాడులకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా గల బ్యూటీ స్పాలు, మసాజ్ సెంటర్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించడానికి పదుల సంఖ్యలో బృందాలను సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్సీ విభాగ సిబ్బందితో పాటుగా స్థానిక స్టేషన్ స్థాయి నేర విభాగ, శాంతిభద్రతల సిబ్బందిని సైతం కలుపుతూ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెంటర్లపై దాడులు నిర్వహించిన సిబ్బంది కీలక ఆధారాలు సైతం స్వీకరించడంతో పాటుగా పలువురు వ్యభిచార ముఠాలను, విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు బాగోట..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్ పంపిణీ యూనిట్ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్ పంపిణీ యూనిట్ సిబ్బంది డీలర్ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్ కంటే తక్కువగా మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్ జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.
దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్ఫోర్స్మెంట్ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : లోక కల్యాణం కోసం మూడు లోకములను మూడు మూడడుగులుగా కొలిచి.. రాక్షస గుణం కలిగిన బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఘటన నాడు ఆ త్రివిక్రముడు (వామనుడు) చేస్తే.. విశాఖ నగరంలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేసి, రూ.లక్షలాది సొమ్మును కాజేస్తూ రాక్షసులుగా ప్రవర్తించిన ముగ్గురు సీఐలను ఈ త్రివిక్రముడు విశాఖ రేంజ్కి బదిలీ చేయడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. గతంలో డీసీపీగా విధులు నిర్వహించిన డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ నగరంలో అన్ని అంశాలను తనదైన శైలిలో తెలుసుకొని పోలీసు కమిషనర్గా అడుగు పెట్టిన నాటి నుంచే తన పని ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు సీఐలను రేంజ్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడమే కాకుండా వాళ్ల స్థానాలను వెంటనే వదిలిపెట్టి రేంజ్ డీఐజీ వద్ద హాజరయ్యే విధంగా చూడాలని సంబంధిత సబ్ డివిజన్ స్థాయి ఏసీపీలకు ఆదేశాలు జారీ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. గత పోలీసు కమిషనర్ హయాంలో నగరంలోకి చొరబడి ఆర్థిక లావాదేవీల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సీఐలను ముప్పై రోజుల్లో గుర్తించి విధుల నుంచి తప్పించడం పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దుర్భాసలాడి బెదిరించిన మేయర్ భర్త గొలగాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం పోలీస్ కమిషనరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆరిలోవలోని తోటగరువు స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా, షాడో మేయర్ గొలగాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాసలాడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి గూబ పగల గొడతానని, సస్పెండ్ చేసి పారేస్తాను అంటూ దుర్భాసలాడిన విషయం అన్ని చానల్లో, పత్రికల్లో వచ్చాయని తెలిపారు. శ్రీనివాస్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, అధికార కార్పొరేటర్ కాదని, వైసీపీ సాధారణ కార్యకర్త అని ఏం అధికారం ఉందని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దారుణంగా దుర్భాషలాడుతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టాలపై పోలీసులపై వైసీపీ నేతలకు గౌరవ లేదని, అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. సాక్షాత్తు పోలీసులను నడి రోడ్డుపై బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఇప్పటికే షాడో మేయర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తూ జీవీఎంసీ అధికారులను బెదిరిస్తూ ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. అదే వేరే పార్టీ వారు ఇలా చేసి ఉంటే ఈ పాటికి కేసులు పెట్టేవారన్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలతో స్పందనలో ఏడీసీపీ రామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని, స్పందించిన ఆయన చర్యలు తీసుకోమని ఆరిలోవ పోలీసులకు ఆదేశించారన్నారు. పోలీసు అధికారుల సంఘం ఇప్పటికైనా స్పందించాలన్నారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేడు.. అనే సామెత ఆంధ్ర విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు చక్కగా సరిపోతుంది. చాలా రోజులుగా ఆంధ్ర విశ్వకళాపరిషత్లో గంజాయి చలామణి అవుతుందని సంబంధిత ఉన్నతాధికారులకు పలు అనుమానాలు ఉన్నా అటుగా ఏ ఒక్క నిఘా అధికారి పట్టించుకోక పోవడంతో విద్యార్థులు గంజాయికి బానిసలై నిర్మాణుష ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్నారని గుర్తించారు. దీంతో పలు ఆధారాలు సేకరించి సాక్షాత్తు ఏయూ వీసీ నగర పోలీసు కమిషనర్, టాస్క్ఫోర్స్తో పాటుగా త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారని విశ్వసనీయ సమాచారం. దీంతో నగర టాస్క్ఫోర్స్ పోలీసులు నాలుగు రోజులు అటుగా నక్కుతూ నిఘా కట్టుదిట్టం చేయడంతో కంగుతిన్న నిజాలు తేటతెల్లమయ్యాయి. ఏయూలో రోజువారీ విద్యార్థులకు గంజాయి అందుతున్న మార్గాలను, విక్రయించే వ్యక్తులను గుర్తించి శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో కథ సుఖాంతం అయిపోయిందని అనుకుంటున్నారా..? అసలు కథ అక్కడే మొదలైయిందని పోలీసులు గుర్తించారు. విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులు బయట నుంచి ఏయూ లోపలికి చొరబడి విక్రయించడం లేదని, విశ్వ విద్యాలయం గేటు వద్ద ఉన్న వ్యక్తులే విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అంటే అక్కడే అసలు విషయం స్పష్టంగా అర్థం అయిపోతుంది. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులే ఆ విక్రయాలు చేస్తున్నట్టు తెలుసుకొని టాస్క్ఫోర్స్ సిబ్బంది వల వెయ్యడంతో ఏకంగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులు అరకేజీ గంజాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి స్థానిక త్రీటౌన్ పోలీసు స్టేషన్కి అప్పగించడంతో కేసు నమోదు చేసి పెద్దగదిలి, సింహగిరి కాలానీలో నివసిస్తున్న టెంటు చంద్రమోళి(29), ఎంవీపీకాలానీ, శివాజీపాలెంలో నివసిస్తున్న సిత అప్పలరాజు(42), రాజీవ్ నగర్లో ఉంటున్న పిల్లా ఉదయ్ సురేష్(30)ని రిమాండ్కి తరలించినట్టు సంబంధిత ఎస్సై తెలిపారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పరార్ అయిన మరో నిందితుడు పి.సంతోష్ని సైతం అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై విచారణ ప్రారంభించగా గంజాయిని సరఫరా చేస్తున్న మరో ముగ్గురు నిందితులు పి.మోహన్ సాయి(23), బి.సతీష్(25), జి.గోవింద్(30)ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
విశ్వ విద్యాలయంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నలుదిక్కుల కాపలా కాయవల్సిన కాపాలదారులే కపట ఆలోచనలకు ఆజ్యం పొయ్యడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా సెక్యూరిటీ గార్డులే విద్యార్థులకు మత్తు పదర్థాలను విక్రయిస్తూ దొరికిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత యాజమాన్యాలపై మండిపాటు చూపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మద్యం సేవించడం, డ్రగ్స్ వినియోగం, ఆసాంఘిక కార్యక్రమాలు వంటి ఘటనలు జరిగి ఏయూ పరువు పోయిన పరిస్థితులు ఉన్నా ఈసారి ఏకంగా రక్షణ కాయవల్సిన సెక్యూరిటీ గార్డులే విద్యార్థులకు గంజాయిని విక్రయించడం విస్మయానికి గురిచేస్తుంది.
విశ్వ విద్యాలయంలో తన సిబ్బందితో పాటుగా విద్యార్థుల అడుగుజాడలను నిత్యం కనిపెడుతూ ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన సెక్యూరిటీ వ్యవహారాల పర్యవేక్షక ఉన్నతాధికారి నిఘా శూన్యంగా కనిపిస్తుంది. ఆయన గతంలో నగరంలో అడిషనల్ ఎస్పీ స్థాయిలో విధులు నిర్వహించి పదవీ విరమణ అనంతరం ఏయూలో ఓ ప్రత్యేక స్థానాన్ని తన కోసం సృష్టించి ఉద్యోగంలో చేరారని ఆనోట.. ఈనోట.. గుస గుసలు గట్టిగానే వినిపించాయి. ప్రభుత్వంలో కీలక వ్యక్తి పైరవీలతో లేని పోస్టులను సైతం సృష్టించి భారీ జీతం ఇవ్వడం ప్రారంభించిన విషయం అందరికీ విధితమే.. కానీ అక్కడ అంత మొత్తంలో జీతం తీసుకొని తన వద్ద డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ టెంటు చంద్రమోళి(29) సైతం గంజాయి విక్రయిస్తూ పట్టుబడటంపై ఆయన విధి నిర్వహణ ఇట్టే అర్థం అయిపోతుంది. గతంలో అడిషనల్ ఎస్పీ స్థాయిలో విధులు నిర్వహించిన పనితీరు కాసంత కూడా ఇక్కడ చూపించకుండా ఏయూ సెక్యూరిటీ వ్యవహారాల పర్యావేక్షక అధికారి హోదాను, ఓ సఫారీ కారుని, తన రక్షణకు నలుగురు గార్డులతో పాటుగా పలు సేవలను ఏ విధంగా అనుభవిస్తున్నారో సంబంధిత అధికారులే వెల్లడిరచాలి. ఆయన పర్యావేక్షణలో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకడైన చంద్రమోళి గతంలో రాత్రి గస్తీ నిర్వహించి మహిళా విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవిస్తున్నారని గుర్తించి వాళ్లను బెధిరించి డబ్బులు గుంజుకోవడం వంటి విషయాలు తెలిసినా విధుల్లో కొనసాగించడంపై ఉన్నతాధికారుల పర్యావేక్షణ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
విశ్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్న పరువు ప్రతిష్టలు బుగ్గిపాలు అవుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు అటుగా పట్టించుకోకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విద్యార్థులు మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలు, మాదక ద్రవ్యాలు ఉపయోగంచడం వంటి ఘటనలు జరుగుతున్నాయని గుర్తించి చర్యలు తీసుకున్నా తాజా సంఘటన మరోమారు ఉలిక్కి పడే విధంగా చేసిందనే చెప్పాలి. కాపాల కాసే సెక్యూరిటీ గార్డులే గంజాయి వంటి మత్తు పదర్థాలను విక్రయిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడటం మరోమారు ఏయూ పరువు పోయిందనే చెప్పాలి. ఏస్ఈబీ, టస్క్ఫోర్స్ బృందాలు జాయింట్ ఆఫరేషన్ని నిర్విహించి ఈ వ్యవహారాన్ని బయట పెట్టినా మీడియాకు రెండు రోజుల తరువాత తెలియడం ఆలోచించాల్సిన విషయం..? మీడియా ముందు గుట్టుగా ఉన్న ఉన్నతాధికారులు తమ గుమ్మంలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడంలో ఎందుకు నీరు కారుతున్నారో అని పలు వర్గాలు ప్రశ్నిస్తునే ఉన్నాయి. అంగులు ఆర్భాటాలకు పోయి ఎప్పుడూ లేని సెక్యూరిటీ ఆఫీషర్ స్థాయిని కేటాయించి భారీ మొత్తంలో జీతాలను, కారులను, వ్యక్తిగత రక్షణ సిబ్బందిని కేటాయిస్తున్న సమయంలో సైతం ఈ ఘటనలు బయట పడటం విశ్వ విద్యాలయం పరువు బుగ్గిపాలు చేస్తున్నట్టే అని పలువురు విద్యార్థి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం: పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాది పాటుగా ఉచితంగా ఇవ్వవలసిన బియ్యం, సబ్సిడీలో ఇవ్వవలసిన పప్పు, పంచదార, గోదుమ పిండి సైతం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయంటే అశ్చర్యపడనవసరం లేదు. ఓ దొంగ వ్యాపారి సరికొత్త బ్యాండ్ బ్యాగ్లను తయారు చేసి రైస్ మిల్లు నుంచి దుకాణాలకు తరలిస్తున్నట్టు రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి పక్కకు తరలిస్తుంటే మరో వ్యాపారి పాత సంచుల్లోనే సామాగ్రిని తరలించినట్టు మూడో కంటికి కనిపించకుండా బియ్యాన్ని చక్కగా మిల్లులకు తరలిస్తున్నారు. మరి కొందరు వ్యాపారస్తులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు రాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఎండీయూ వాహనాల్లోనే నార సంచుల్లో బియ్యాన్ని మిల్లులకు పంపించి పని కానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలు ఫిర్యాదులు అందించినా అటుగా పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారని బహిరంగంగానే పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్ విభాగ దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల సైతం ఈ నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఉండటంతో పక్కదారి పడుతున్న పేదల బియ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటుగా విశాఖలో కూడా అకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులతో పాటుగా డీలర్స్, ఎండీయూ సిబ్బందిని సైతం చమటలు పట్టించిన ఘటనలు మరువక ముందే తిరిగి జోరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే పీడీఎస్ బియ్యం వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా ఒకటి రెండు కేసులను నమోదు చేసి రోజుకి వేల సంఖ్యలో బస్తాలు పక్కదారి పడుతున్నా అటుగా పట్టించుకోలేని వ్యవస్థ ఉన్నంత వరకు బియ్యన్ని అక్రమ మార్గంలో తరలించి, ఫ్యాన్సీ నెంబర్ కారుల్లో తిరుగుతన్న పెద్దల పబ్బం గడుస్తునే ఉంటుంది. ఈ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ మరోమారు అక్రమార్కుల అంతు చూస్తే నాణ్యమైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం పేదలకు చేరుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): మత్తును కలిగించే మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగ, విక్రయాలతో పాటుగా అక్రమ రవాణా చేస్తున్నారని ఐదుగురు నిందితులను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో శాంతి భద్రతల డీసీపీ-2 నిందితుల వివరాలతో పాటుగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సైకోట్రోపిక్ పదార్ధమైన ఎండీఎంఏని సైతం విలేకరుల సమావేశంలో చూపించారు. అనంతరం నిందితులను రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పి అంతా చక్కగా ముగించగా.. అక్కడ నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఓ స్టేషన్ స్థాయి అధికారితో పాటుగా తోటి సిబ్బంది సైతం ఉరుకులు పరుగులు మొదలయ్యాయని ఆ నోట.. ఈ నోట.. గుసగుసలు గుప్పుమన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడానికి సిద్ధం చేసిన ఐదుగురు నిందితుల్లో ఒక నిందితుడు పరార్..? అయిపోయాడని, ఆ నిందితున్ని పట్టుకోవడానికి పోలీసు సిబ్బంది పరుగులు పెడుతున్నారని స్టేషన్కి మరొక కేసుల్లో వచ్చిన బాధితులు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ద్వారకానగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఏ1 నిందితుడు సుంకర ప్రశాంత్(27), బెంగళూరు, కేజీ హల్లి ప్రాంతానికి చెందిన ఏ2 సయ్యద్ అజర్ అలీ(23), వన్టౌన్, రెల్లివీధికి చెందిన ఏ3 రత్నాల విష్ణు వర్ధన్(26), జగదాంబ, కుమ్మరి వీధిలో నివసిస్తున్న ఏ4 వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22), కలెక్టర్ కార్యాలయం సమీప అఫీషియల్ కాలనీలో నివసిస్తున్న ఏ5 గురజాపు వినాయక భాగ్య తేజ(27)ని టాస్క్ఫోర్స్ పోలీసులు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుకొని సంబంధిత స్టేషన్కి అప్పగించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అధికార యంత్రాంగం నిందితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి రిమాండ్కి పంపించడంలో కాసంత పరాక్కుగా ఉండటంతో నిందితుల్లో ఓ నిందితుడు పరార్..? అయిపోయాడని విశ్వసనీయ సమాచారం అందింది. ఏ4 నిందితుడుగా ఉన్న వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22) మూత్రం వస్తుందని చెప్పి చక్కగా గోడదూకి పారిపోయాడని అక్కడి పరిచయ వ్యక్తుల నోట వినికిడి..