నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముఖ్యంగా ఆ పోలీసు స్టేషన్లో ఓ కుర్చీ కోసం చిన్న స్థాయి యుద్ధమే జరిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎత్తులు.. పైఎత్తులు.. వేసుకుంటూ కుర్చీ కోసం పోట్లాడుకున్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆఖరికి ఎడమొహం.. పెడమొహం.. పెడుతూ సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్ చెంతకు చేరుకొని సమీప స్టేషన్లకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్డర్లు సైతం తెచ్చుకున్నారు. అయినా స్టేషన్ను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించక సంబంధిత సిబ్బంది నేటికి స్టేషన్లో సతమతం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగర వ్యాప్తంగా అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్లో కీలక పోలీసు స్టేషన్గా గుర్తింపు పొందిన ఆ స్టేషన్లో జనరల్ సిబ్బందిగా చలామణి అవుతున్న ఓ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న దందా తోటి సిబ్బంది నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగున అతని అవినీతి జాడలు అంటించడంతో తమ మనుగడ చాలా కష్టంగా ఉందని బోరుమంటున్నారు. ఎండకు గుక్కెడు నీరు కావాలన్నా ఆ అయ్యగారి అనుమతి కావాలన్నట్టు అక్కడి పరిస్థితులు మారిపోయాయని వాపోతున్నారు. బడా బాబులు, బజారులు, బారుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అన్ని చోట్ల పెద్ద మొత్తంలో దండుకుంటున్న అవినీతి జలగపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కన్ను పడిరదని సమాచారం. ఇదే క్రమంలో రోజువారీ స్టేషన్కి తీసుకొచ్చే ఓపెన్ డ్రిరకింగ్ (బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం) వంటి ఫిర్యాదుల్లో దండీగా దండుకుంటున్న సిబ్బంది ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకునే నటనను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే జీడీలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి బేరసారాలు కుదరనివి మాత్రమే.. అది కూడా పదుల సంఖ్యలో కోర్టుకు పంపించి జరిమానాలు విధిస్తున్నారని సంబంధిత స్టేషన్ సిబ్బంది బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. ఈ స్టేషన్లో ప్రతీ అంశానికి ఓ ధరను నిర్ణయించి అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్గా నడపడంతో స్టేషన్లో నలుగురు సిబ్బంది ఠాణా లేఖరి (స్టేషన్ రైటర్) కుర్చీ కోసం పోట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

- ఆ పోలీసు స్టేషన్లో అంతా రాజకీయమే..
రోజువారీ స్టేషన్లో జరుగుతున్న కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు సిబ్బంది ఇప్పుడు అర్జీలు పెట్టుకొని బదిలీపై వెళ్లిపోవడం అక్కడ ఉత్కంఠను తలపిస్తుంది. స్టేషన్కి అవసరమైన నిధులు సమకూర్చే క్రమంలో నాలుగు రాళ్లు పక్కన వేసుకునే ఇరువురు ఒకేసారి బదిలీపై వెళ్లిపోవడంపై స్టేషన్లో అంతర్గత రాజకీయాన్ని తలపిస్తుంది. అదే స్టేషన్ పరిధిలో గత ఐదేళ్లు స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేసి ఇప్పుడు అదే స్టేషన్లో రైటర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వద్ద ఇన్ని రోజులు రాజకీయం చేసిన వ్యక్తులు ఎందుకు కుర్చీని వదులుకున్నారో అర్థం కావడంలేదని సంబంధిత సిబ్బందే తర్జన బర్జన పడుతున్నారు.
- నగర పోలీసు సిబ్బందిపై నిఘా ఎక్కడా..?
నగర వ్యాప్తంగా ఉన్న 23పోలీసు స్టేషన్లు, అనుబంధ అధికార కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై నిఘా శూన్యంగా మారింది. స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంలో అలసత్వం చూపిస్తున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23పోలీసు స్టేషన్ల పరిధిలో జనరల్ సిబ్బంది పేరిట ముద్ర వేసుకొని ఇష్టానుసారంగా దండుకుంటున్నారని, స్టేషన్లో జరిగే పదవీ విరమణ కార్యక్రమాలు అంబరాన్ని అంటే సంబరంగా జరగడానికి ఈ జనరల్ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ఓ పోలీసు స్టేషన్ ఆవరణంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మద్యం పార్టీకి అధిక సంఖ్యలో మద్యం సీసాలు సమకూర్చడంలో ఈ జనరల్ సిబ్బంది పనితీరు స్పష్టంగా కనిపించిందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇటువంటి అంశాలపై ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ దృష్టి కేంద్రికరిస్తే.. 2016లో పోలీసు కమిషనర్ టి.యోగానంద్ జనరల్ సిబ్బందిపై కొరడా ఝుళిపించిన సందర్భం గుర్తొస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.