నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): మత్తును కలిగించే మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగ, విక్రయాలతో పాటుగా అక్రమ రవాణా చేస్తున్నారని ఐదుగురు నిందితులను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో శాంతి భద్రతల డీసీపీ-2 నిందితుల వివరాలతో పాటుగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సైకోట్రోపిక్ పదార్ధమైన ఎండీఎంఏని సైతం విలేకరుల సమావేశంలో చూపించారు. అనంతరం నిందితులను రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పి అంతా చక్కగా ముగించగా.. అక్కడ నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఓ స్టేషన్ స్థాయి అధికారితో పాటుగా తోటి సిబ్బంది సైతం ఉరుకులు పరుగులు మొదలయ్యాయని ఆ నోట.. ఈ నోట.. గుసగుసలు గుప్పుమన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడానికి సిద్ధం చేసిన ఐదుగురు నిందితుల్లో ఒక నిందితుడు పరార్..? అయిపోయాడని, ఆ నిందితున్ని పట్టుకోవడానికి పోలీసు సిబ్బంది పరుగులు పెడుతున్నారని స్టేషన్కి మరొక కేసుల్లో వచ్చిన బాధితులు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ద్వారకానగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఏ1 నిందితుడు సుంకర ప్రశాంత్(27), బెంగళూరు, కేజీ హల్లి ప్రాంతానికి చెందిన ఏ2 సయ్యద్ అజర్ అలీ(23), వన్టౌన్, రెల్లివీధికి చెందిన ఏ3 రత్నాల విష్ణు వర్ధన్(26), జగదాంబ, కుమ్మరి వీధిలో నివసిస్తున్న ఏ4 వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22), కలెక్టర్ కార్యాలయం సమీప అఫీషియల్ కాలనీలో నివసిస్తున్న ఏ5 గురజాపు వినాయక భాగ్య తేజ(27)ని టాస్క్ఫోర్స్ పోలీసులు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుకొని సంబంధిత స్టేషన్కి అప్పగించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అధికార యంత్రాంగం నిందితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి రిమాండ్కి పంపించడంలో కాసంత పరాక్కుగా ఉండటంతో నిందితుల్లో ఓ నిందితుడు పరార్..? అయిపోయాడని విశ్వసనీయ సమాచారం అందింది. ఏ4 నిందితుడుగా ఉన్న వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22) మూత్రం వస్తుందని చెప్పి చక్కగా గోడదూకి పారిపోయాడని అక్కడి పరిచయ వ్యక్తుల నోట వినికిడి..
- 3గంటలకు పైగా ఉన్నతాధికారుల మంతనాలు..
స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో సైకోట్రోపిక్ పదార్ధమైన 70గ్రాముల ఎండీఎంఏతో పాటుగా ఐదుగురు నిందితులను నగర సిటీ టాస్క్ఫోర్స్ యాంటీ నార్కోటిక్ బృందం పట్టుకొని స్టేషన్కి అప్పగించిన ఐదుగురిలో ఓ నిందితుడు ఎక్కడికి పోయాడు..? ఎలా జరిగింది..? ఎవరు బాధ్యులు..? అనే కోణంలో విచారణ జరిగిందనే చెప్పాలి. ఓ ఉన్నతాధికారితో పాటుగా సబ్ డివిజన్ అధికారి సైతం విషయం తెలుసుకొని అక్కడకి చేరుకున్నారు. స్టేషన్ స్థాయి అధికారి గదిలో గంటలు తరబడి విచారణ చేపట్టారు. సాయంత్రం వచ్చిన అధికారులు రాత్రి సుమారు 10.35గంటల సమయంలో తమ పద్ధతిలో విచారణ జరిపి అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. విచారణలో ముఖ్యంగా వచ్చిన కీలక అంశాల్లో ప్రధానమైనది నిందితులను స్టేషన్లో ఉంచిన సమయంలో ఎంత మంది సెంట్రీగా ఉన్నారు..? నిందితుడు ఏ విధంగా బయటకు వెళ్లిపోయాడు..? బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తాడు..? ఎంత సేపటికి పట్టుకుంటారు..? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి నిందితుని వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి సంబంధిత సిబ్బంది అన్ని అస్త్రాలను ఉపయోగించే పనిలో బిజీ బిజీగా ఉండటంతో ఆదివారం విరామంలో ఉన్న కొంత మంది సిబ్బందికి మిగిలిన నిందితులను కాపాడుకునేందుకు సెంట్రీ (కాపల) ఉద్యోగం పడటంతో స్టేషన్లో ఆదివారం రాత్రి 11గంటల సమయంలో గేటుకు అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు.. సిబ్బంది కాపలా కాయడంతో కొత్తగా కనిపించింది.
- అసలు నిందితుడు పరార్ అయ్యాడా చేశారా..?
స్టేషన్లో ఉన్న ఐదుగురు నిందితుల్లో ఒక నిందితుడు తాను వేసుకున్న పథకం ప్రకారం బయటకి పరార్ అయిపోయాడంటే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా..? ఆనోట.. ఈనోట.. విన్న వాస్తవ సందేహాల..? అనే విషయం తెలియాల్సి ఉంది. అసలు నిందితుడు పరార్ అయ్యాడా..? లేదా స్టేషన్లోనే ఉన్నాడా..? ఉంటే రిమాండ్లో ఉండాల్సిన నిందితులు 24గంటలు తరువాత కూడా స్టేషన్లో ఎందుకు ఉన్నారు..? టాస్క్ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం సుమారు 5గంటల సమయంలో నిందితులను అప్పగించారని ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం 5గంటల లోపు ఓ మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచి ఎందుకు రిమాండ్కి తరలించలేదు..? ముందస్తుగానే నిందితుడు వేసుకున్న పథకం ప్రకారం పరార్ అయిపోయాడా..? లేదా ఏదైన రాజకీయ ఒత్తిడితో పరార్ అయ్యాడా..? లేక స్టేషన్లో రాజకీయం చేశారా..? అనే సందేహాలు పలువురు పోలీసు సిబ్బంది నోట వచ్చాయంటే అక్కడ ఏదో ఘటన జరిగిందనే అంచనా వేస్తున్నారు.
- పోలీసులకు మస్కా కొట్టిన కేటుగాడు..
స్టేషన్లో ఉండాల్సిన నిందితుడు అక్కడి సిబ్బంది కళ్ళు కప్పి కనిపించకుండా పరారైపోయాడంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి. మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రిమాండ్కి పంపించాల్సిన నిందితులను ఉంచే ప్రదేశం నుంచి బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సిందే అని పలువురు సిబ్బందే వెల్లడిస్తున్నారు. అటువంటిది పోలీసుల నుంచి తప్పించుకొని బయటకు పరార్ అయ్యాడంటే అక్కడ ఏదో లోపం జరిగిందని వివరిస్తున్నారు. బయటకు వచ్చిన నిందితుడు వ్యసనాలకు బానిసై ఈ మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్నాడంటే ఈ నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపార నిమిత్తం బయటకు వచ్చి ఉంటాడా..? ఏ ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతాయో అన్ని తెలుసుకొనే పరార్ అయ్యాడా..? అనే కోణంలో సిబ్బంది పరుగులు పెడుతున్నారు. దీనిపై సంబంధిత స్టేషన్ స్థాయి సిబ్బందిని ప్రశ్నించగా నొప్పించక తప్పించుకొన్నవాడే నేర్పరి సుమతి అనే పద్ధతిలో మాటల మధ్యలో వెళ్లిపోయారు.