- జోన్-4లో అక్రమ వసూలతో చెలరేగిపోతున్న ప్లానింగ్ సిబ్బంది..
- సిబ్బంది అండతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న యజమానులు..
- ఇన్స్పెక్టర్, చైన్మాన్లు, సెక్రటరీలు హెచ్చు తగ్గు వాటాలతో లబ్ధి..
- కార్పొరేటర్ల అండతో భారీ నిర్మాణాలకు నకిలీ అనుమతులు..
- అదనపు అంతస్తులు నిర్మిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు..
- ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్న చోద్యం చూస్తున్న అనిశా..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్-4లో టౌన్ప్లానింగ్ రింగ్ మాస్టర్లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్ప్లానింగ్ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4 టౌన్ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్-4 టౌన్ప్లానింగ్ సిబ్బంది, వార్డు ప్లానింగ్ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
- అవినీతిని అంతం చేయాల్సిన సిబ్బంది ఆజ్యం పోస్తున్నారు..
పేద ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి అవినీతి జరగకూడదని, అవినీతిని అంతం చేయడానికి నూతన ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఆ వ్యవస్థలో సైతం అవినీతి బురద చేరిపోయింది. ముందున్న ముదురు సిబ్బంది వెళ్లే మార్గంలో సంబంధిత కార్యదర్శులను తీసుకెళ్లడంతో అవినీతిని అంతం చేయాల్సిపోయి ఆజ్యం పోస్తున్నట్టు తయారైయింది. చైన్మాన్లు నిర్ణయించిన ధరలో తమకు సైతం వాటా వస్తుందని అనధికార అదనపు అంతస్తులను చూసి చూడనట్టు వ్యవరిస్తున్నారు. తీరా ఆ నోటా.. ఈ నోటా.. అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని ఒత్తిడి తీసుకొస్తే ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రారంభంలో సెల్లార్ ఫ్లోర్లో ఖాళీగా దర్శనమిచ్చే ఫ్లోర్ ప్రస్తుతం గదులతో దర్శనమిస్తున్నాయని ప్రశ్నిస్తే వాటికి కూడా అనుమతులు ఉన్నాయని సర్వేయర్ల నుంచి తీసుకున్న నకిలీ పత్రాలు చూపిస్తూ తప్పించుకుంటున్నారు. జోన్ పరధిలో అవినీతి జలగలు ఉన్నంత వరకు అనుమతులు లేని అదనపు అంతస్తులు వస్తునే ఉంటాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ప్లానింగ్ సిబ్బంది చెలరేగిపోతున్నారు..
జోన్`4లో టౌన్ప్లానింగ్ చైన్మాన్లుగా కొనసాగుతున్న కొందరు వ్యక్తులు చేప్పిందే శాసనంగా తయారైయింది. వార్డుల్లో పర్యటించి అనధికార అంతస్తులు నిర్మిస్తున్న యజమానులతో ముందస్తుగా బేర సారాలు చేస్తున్నారు. తీరా అక్కడ వ్యాపారం తమ పరిధిలోకి రావడం లేదని గుర్తించిన వ్యక్తులు తమపై ఉన్న అధికారి సాయంతో అక్కడకు చేరుకొని వీరంగం సృష్టిస్తారు. ఆ సమయంలో బేరం కుదిరితే సరేసరి.. లేకపోతే యమభటులు మాదిరి పెద్ద పెద్ద సుత్తులు, గున్నపాములు తీసుకొచ్చి భవనాన్ని నేలమట్టం చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. జీవీఎంసీ గుర్తింపు పొందిన లైసెన్స్ సర్వేయర్లు ఇచ్చిన నకిలీ ప్లాన్లతో భవనాన్ని ప్రారంభించిన యజమానులు ఆశకు పోయి అదనపు అంతస్తులు నిర్మించడానికి రూ.లక్షలు వృథాగా ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వం బీపీఎస్ పద్ధతిని ప్రవేశ పెట్టకుండా అనధికార అదనపు అంతస్తులు నిర్మించడానికి టౌన్ప్లానింగ్ అధికార సిబ్బంది ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారో అంతు చిక్కడం లేదని పలువురు హేలను చేస్తున్నారు. దీనిపై జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలకు ముహుర్తం ఖరారు చేయకపోతే త్వరలో జీవీఎంసీనే తాకట్టు పెట్టే స్థాయికి ఈ టౌన్ప్లానింగ్ యంత్రాంగం సిద్ధమవుతుందని ఊహాగానం. ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యవస్థపై అవినీతి నిరోధక శాఖ సైతం దృష్టి పెడితే అవినీతి జలగలు పుట్టల పుట్టలుగా పట్టుబడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- సిబ్బంది చేష్టలకు చిర్రెత్తిపోతున్న ప్రజలు..
వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్ప్లానింగ్ చైన్మెన్ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్-4 పరిధిలో పనిచేస్తున్న చైన్మాన్లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్ప్లానింగ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్ప్లానింగ్ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.